- నేటి నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ
- నీట్ స్కోరుతోనే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా (బీ, సీ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు https://tspvtmedadm.tsche.in వెబ్ సైట్లో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.12,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
నీట్ స్కోరులో జనరల్ అభ్యర్థులకు 213, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 177, దివ్యాంగులకు 194 మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. బీ -కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించారు. అడ్మిషన్లు కేవలం మెరిట్ ప్రాతిపదికన ఆన్లైన్ వెబ్ ఆప్షన్ల ద్వారానే జరుగుతాయని, సీట్లు ఇప్పిస్తామనే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వర్సిటీ రిజిస్ట్రార్ హెచ్చరించారు. సందేహాల కోసం 7901098840 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు.
