తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయింది

తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయింది
  • కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మేడ్చల్: తెలంగాణ తల్లి సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బందీ అయిందని, కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో కలసి  ప్రారంభించారు రేవంత్ రెడ్డి. బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు రెండు రోజుల పాటు డిజిటల్ మెంబర్ షిప్ అవగాహన సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంత మంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని వివరించారు. 
రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయి
బీజేపీ, టిఆరేస్ రెండు పార్టీలు తోడు దొంగలేనని, రాష్ట్రానని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ‘వరి వేస్తే ఉరే’ అని కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు జరుగుతోందని, క్రమశిక్షణ కాంగ్రెస్ లో చాలా ముఖ్యం అన్నారు. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం కేసీఆర్ మాటలు నిజం చేయొద్దు అని రేవంత్ రెడ్డి సూచించారు. మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేనని, కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయిందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. 
పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్లు చచ్చినోళ్లతో సమానం
పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్లు చచ్చిన వాళ్ళతో సమానమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, బాగా కష్టపడే వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడని కార్యకర్తలపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.