మెడికల్ కాలేజీలకు 319 మంది కొత్త ప్రొఫెసర్లు

మెడికల్ కాలేజీలకు 319 మంది కొత్త ప్రొఫెసర్లు
  • అసోసియేట్​ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 319 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్యానెల్ ఇయర్ రూల్స్‌‌కు కూడా వన్‌‌టైమ్ సడలింపు ఇచ్చింది.

ఈ మేరకు హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జె. చొంగ్తూ జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన 8 మెడికల్ కాలేజీలతో పాటు ఈ ఏడాది కొడంగల్ మెడికల్ కాలేజీలోనూ క్లాసులు షురూ అయ్యాయి. దీంతో ఎంబీబీఎస్, పీజీ సీట్లు కూడా పెరిగాయి. ఎన్‌‌ఎంసీ రూల్స్ ప్రకారం సీట్లకు తగ్గట్టుగా ప్రొఫెసర్లు ఉండటం తప్పనిసరి. లేదంటే కాలేజీల గుర్తింపుపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లకే ప్రమోషన్లు ఇచ్చి ఫ్యాకల్టీ కొరతను భర్తీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ప్యానెల్ ఇయర్ సడలింపు...

సాధారణంగా ప్రొఫెసర్​గా ప్రమోషన్ పొందాలంటే అసోసియేట్ ప్రొఫెసర్‌‌గా నిర్దేశిత సర్వీస్ పూర్తి చేయాలి. అయితే కొత్త కాలేజీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ అండ్ ఎస్‌‌ఎస్ రూల్స్‌‌(1996)లోని రూల్ 6 నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 2026-–27, 2027–-28 ప్యానెల్ ఇయర్లలో ప్రమోషన్ పొందాల్సిన వారినీ ఈసారి 2025–-26 ప్యానెల్‌‌లోనే పరిగణనలోకి తీసుకుంది.

దీంతో క్లినికల్, నాన్-క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన 319 మంది డాక్టర్లకు ప్రమోషన్లు దక్కనున్నాయి. ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం డీఎంఈని ఆదేశించింది.