పోడు సాగుదారులపై దౌర్జన్యాలు ఆపాలి : సంకె రవి

పోడు సాగుదారులపై దౌర్జన్యాలు ఆపాలి :  సంకె రవి

కోటపల్లి, వెలుగు: తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారుల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలంగాణ రైతు సంఘం (ఏఐఎస్కే) జిల్లా అధ్యక్షుడు సంకె రవి మండిపడ్డారు. వేధింపులను వెంటనే మానుకోవాలని డిమాండ్​చేశారు. మంగళవారం కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి, అర్జునగుట్ట గ్రామాల్లోని రైతులతో ఏర్పాటు సమావేశమై మాట్లాడారు. ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారుల వేధింపులు పెరిగిపోయాయన్నారు.

 సాగు భూములపై ఆధారపడి జీవిస్తున్న వారిపై  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం, ట్రాక్టర్లను గుంజుకపోవడం, రైతులను బలవంతంగా వెళ్లగొట్టడం మానుకోవాలని డిమాండ్​చేశారు. రైతుల పొట్ట కొట్టి ఆకలి చావులకు గురయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపేద రైతులు వ్యవసాయం చేసుకునేలా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి అడ్డువస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మత్స్యకార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోడంకి చందు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, గ్రామ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సమ్మయ్య, వెంకటి, రైతులు పాల్గొన్నారు.