- 5x5 విమెన్స్ బాస్కెట్ బాల్ టీమ్కు కూడా
- వ్రితి అగర్వాల్కు సిల్వర్, బ్రాంజ్
సూరత్: నేషనల్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారుల స్వర్ణ పతక జోరు కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రానికి మూడు గోల్డ్ మెడల్స్ లభించాయి. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో బి. సాయి ప్రణీత్, విమెన్స్ డబుల్స్లో సిక్కిరెడ్డి–పుల్లెల గాయత్రి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. 5x5 విమెన్స్ బాస్కెట్ బాల్ టీమ్ సైతం గోల్డ్ ఖాతాలో వేసుకుంది. అలాగే, యంగ్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ సిల్వర్, బ్రాంజ్తో మెప్పించింది. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సీనియర్ షట్లర్ సాయి ప్రణీత్ 21–-11,12–-21,21–-16 తో కర్నాటకకు చెందిన మిథున్ మంజునాథ్ పై విజయం సాధించి చాంపియన్గా నిలిచాడు. విమెన్స్ డబుల్స్ టైటిల్ ఫైట్లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన సిక్కి–గాయత్రి (తెలంగాణ) జంట 21–14, 21–11తో శిఖా గౌతమ్–అశ్విని భట్ (కర్నాటక) ద్వయంపై వరుస గేమ్స్లో గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. దాంతో, బ్యాడ్మింటన్లో తెలంగాణకు మూడో గోల్డ్ లభించింది. మిక్స్డ్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లోనూ రాష్ట్ర జట్టు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
బాస్కెట్బాల్ టీమ్ డబుల్ ధమాకా
తెలంగాణ విమెన్స్ బాస్కెట్బాల్ టీమ్ మరోసారి సత్తా చాటింది. ఇప్పటికే 3x3 కేటగిరీలో చాంపియన్గా నిలిచిన మన అమ్మాయిలు 5x5లోనూ సత్తా చాటి గోల్డెన్ డబుల్ సాధించారు. విమెన్స్ 5x5 కేటగిరీలో ఫైనల్లో మన జట్టు 67–62 తేడాతో తమిళనాడును ఓడించి విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఫస్టాఫ్లో 35–31తో ఆధిక్యంలో నిలిచిన తెలంగాణ చివరిదాకా దాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం ఏడు గోల్డ్ సహా 18 మెడల్స్తో పతకాల పట్టికలో తెలంగాణ 14వ స్థానంలో కొనసాగుతోంది.