
నకిరేకల్, వెలుగు : మండలంలోని మంగళపల్లి గ్రామంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. క్రీడల్లో గెలుపొందిన విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన క్రీడల అభివృద్ధిశాఖ జిల్లా అధికారి కే.నర్సిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ మంగళపల్లిలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన గ్రామస్తులు, నిర్వాహకులను అభినందించారు.
విజేతలు వీరే..
బాలుర విభాగంలో ఫైనల్స్ లో కరీంనగర్ – వరంగల్ జిల్లా జట్లు తలపడగా, కరీంనగర్ జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న నల్లగొండ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో ఫైనల్స్ లో వరంగల్ – ఖమ్మం జిల్లా జట్టు తలపడగా, వరంగల్ జిల్లా జట్టు విజయం సాధించి ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఖమ్మం జిల్లా జట్టు ద్వితీయ స్థానం, రంగారెడ్డి జిల్లా జట్టు తృతీయ స్థానం దక్కించుకున్నాయని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఉస్మాన్ పుల్లయ్య తెలిపారు. హెచ్ఎం కర్ర వీరారెడ్డి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.