పరిశ్రమల్లో లోకల్ యూత్కే ఎక్కువ జాబ్స్ ఇప్పించేందుకు చర్యలు
రోజూ 40 వేల మందికి కరోనా టెస్టులు.. ఎంతమందికైనా ట్రీట్ మెంట్
దోపిడీకి పాల్పడే ప్రైవేటు హాస్పిటల్స్ పై కఠిన చర్యలు
ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీకి ప్రోత్సాహం.. కేబినెట్ భేటీలో నిర్ణయాలు
మన నీళ్ల ను ఎత్తుకుపోయేందుకు పోతిరెడ్డిపాడు పేరిట భారీ స్కెచ్ వేసి ఏపీ ముందుకు వెళ్తుంటే.. మన సర్కారేమో అపెక్స్ మీటింగ్ ను ఆపేయించి మరీ కేబినెట్ సమావేశం పెట్టింది. అందులో సెక్రటేరియట్ కొత్త డిజైన్ కు ఆమోదం తెలిపింది. ఈస్ట్ ఫేసింగ్లో నిర్మించే సెక్రటేరియట్ బిల్డింగ్ లో ఏడు అంతస్తులు (2+4+1), సకల సౌలతులు ఉంటాయని వెల్లడించింది. 600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పుతో సెక్రటేరియట్ను నిర్మించనున్నారు. మెయిన్ ఎంట్రన్స్ ఎలివేషన్కు రాజస్థాన్లోని దోల్పూర్ బీగ్ సాండ్ స్టోన్ ను ఉపయెగిస్తారు. సీఎం ఆఫీస్ ఉండే ఏడో అంతస్తు ఎలివేషన్కు మంగళూరు పెంకులలాంటి డిజైన్ ఉంటుంది.
రాష్ట్రంలో రోజుకు 40 వేల మందికి కరోనా టెస్టులు చేయాలని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. ఎంతమందికి వైరస్ సోకినా ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సూచించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో లోకల్ యూత్ కే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కొత్త విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సెక్రటేరియట్ కొత్త డిజైన్ కూడా ఆమోదం తెలిపింది. బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సీఎంవో ఈ వివరాలను ప్రెస్ నోట్ రూపంలో వెల్లడించింది.
ఇవీ కేబినెట్ నిర్ణయాలు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్, మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు , ఇతర మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతి రోజు 40 వేల మందికి టెస్టులు చేయాలని, టెస్టుల్లోపాజిటివ్గా తేలిన వారికి ఇవ్వడానికి 10 లక్షల హోం ఐసోలేషన్ కిట్లురెడీ చేయాలని అధికారులను ఆదేశించింది.
ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. హెల్త్ డిపార్ట్ మెంట్కు ఇటీవలే రూ.వంద కోట్లు ఇచ్చామని, అదనంగా ఇంకో రూ.వంద కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. హెల్త్ డిపార్ట్ మెంట్ కు నెలనెల కచ్చితంగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. వీటిపై మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా అవసరాలు తెలుసుకొని, అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా సోకిన వారికి గవర్నమెంట్ హాస్పిటళ్లలో మెరుగైన ట్రీట్మెంట్ అందించడంపై కేబినెట్ చర్చించింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా విస్తరించినా పెద్దనగరాల్లో తగ్గుముఖం పడుతోందని, హైదరాబాద్లోనూ కేసులు తగ్గుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎన్నికేసులు వచ్చినా ట్రీట్మెంట్ చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్న వారికి అవసరమైన మందులు, ఇంజక్షన్లు, భోజనం ఖర్చులు ప్రభుత్వమే భరించనుంది. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లోఎక్కువ ఉద్యోగాలు రాష్ట్ర యువతకే దక్కేలా కొత్త విధానం. స్థానికులకు ఎక్కువ ఉద్యోగ ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు. కేటగిరి -1 ఇండస్ట్రీస్లో సెమీ స్కిల్డ్ నైపుణ్యాలు కలిగిన స్థానిక యువతకు 70 శాతం, స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు 50 ఉద్యోగ అవకాశాలు తప్పని సరిగా కల్పించాలి. కేటగిరి -2 ఇండస్ట్రీస్లో సెమీ స్కిల్డ్ గలవారికి 80 శాతం, స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు 60 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాటించే పరిశ్రమలకు మాత్రమే రాయితీలు.
ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్లో ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతంలో మినహా మిగతా ప్రాంతాల్లో ఐటీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూరా కొంపల్లి, ఉప్పల్, పోచారం, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆదిభట్ల, కొల్లూర్, ఉస్మాన్సాగర్ ప్రాంతాల్లో ఐటీ ఇండస్ట్రీకి ప్రోత్సాహం. పెట్రో వెహికల్స్ కారణంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్కు ప్రత్యేక రాయితీలు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ పాలసీని ఏర్పాటు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఓలెక్ట్రా, చార్జ్క్సో , మైత్రా, ఎక్సోకామ్ సంస్థలు రూ.4,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని, 4,195 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని కేబినెట్ తెలిపింది. ఈ పాలసీతో భవిష్యత్లో రాష్ట్రానికి 30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 1.20 లక్షల మందికి ఉద్యోగాలు, 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా వేసింది.