- నేటి నుంచే ఆన్లైన్ దరఖాస్తులు షురూ
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి బుధవారం నుంచి ఆన్ లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈనెల 29 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ జి.రమేశ్ మంగళవారం వెల్లడించారు.
ఈ పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయి. సెప్టెంబర్ 30న ఫలితాలను వెల్లడిస్తారు. పరీక్ష ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులు ఒక పేపర్కు రూ.750, రెండు పేపర్లకు రూ. వెయ్యి చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్కు రూ. 700, రెండు పేపర్లకు రూ. 950గా నిర్ణయించారు. టెట్ పాస్ కావాలంటే జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సప్రదించాలన్నారు.
