
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి చిరంజీవి భేటీ కావడంతో అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలిసింది. సీఎం రేవంత్తో ఉన్న సాన్నిహిత్యం మూలానే చిరంజీవి కలిశారని సమాచారం. సీఎం రేవంత్తో కలిసి చిరంజీవి గతంలో కూడా పలు కార్యక్రమాల్లో భాగమయిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోనే చిరంజీవి నివాసం కూడా ఉంది. తన ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని నటుడు చిరంజీవి పెట్టుకున్న అప్లికేషన్ను చట్టప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం విదితమే. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్ వాల్ నిర్మాణం చేశామని, దీని క్రమబద్ధీకరణకు జూన్ 5న దరఖాస్తు చేసుకోగా జీహెచ్ఎంసీ వద్ద పెండింగ్లో ఉందని చర్యలు తీసుకునేలా ఆర్డర్ ఇవ్వాలని హీరో చిరంజీవి పిటిషన్ వేశారు.
Also Read : టాలీవుడ్లో సోమవారం నుంచి షూటింగ్స్ బంద్
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డి ఇటీవల విచారణ పూర్తి చేసి పై విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో గ్రౌండ్, మరో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్టు న్యాయవాది వివరించారు. దీనిపై జీహెచ్ఎంసీ న్యాయవాది స్పందిస్తూ.. చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.