
థ్రిల్లర్ మూవీస్కి కేరాఫ్ అడ్రస్లా అయిపోయాడు అడివి శేష్. బలమైన పాయింట్తో, టెన్షన్ పెట్టే కథనంతో కట్టిపడేస్తుంటాయి అతడి సినిమాలు. మరి గురువారం రిలీజైన ‘ఎవరు’ కూడా ఆ తరహాలోనే ఉందా? పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనిపించిందా?
కథ
సమీర (రెజీనా) ఓ బడా పారిశ్రామికవేత్త భార్య. తనపై అత్యాచారం చేసిన అశోక్ని (నవీన్ చంద్ర) కాల్చి చంపిన కేసులో చిక్కుకుంటుంది. ఆత్మ రక్షణ కోసం చేశానని ఆమె చెబుతున్నా, దీని వెనుక మరేవో కారణాలు ఉన్నట్టు అనిపిస్తుంది. కేసు నుంచి బయటపడటానికి పోలీసాఫీసరైన విక్రమ్ వాసుదేవ్ (శేష్) సాయం తీసుకుంటుంది. ఆమెకి అతడు సాయం చేస్తాడా, కేసులోంచి బయటపడేస్తాడా, అసలీ కేసు వెనుక ఉన్న నిజమేంటి, హత్య చేసింది సమీరయేనా ఇంకెవరన్నానా అనేది మిగతా కథ.
విశ్లేషణ
ప్రేక్షకులకి ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేసేసి, ప్రతి క్షణం కంగారుపెట్టి, చివరి వరకూ సీట్లకు కట్టేయగలిగేదే సరైన థ్రిల్లర్. ఈ నిర్వచనాన్ని బట్టి ‘ఎవరు’ని ఓ మంచి థ్రిల్లర్ అని చెప్పొచ్చు. తెరమీద జరిగేది ఏమాత్రం ఊహకి అందదు. ఎవరు నిజాలు చెబుతున్నారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, అసలు వాస్తవం ఏంటి అన్నది చివరి వరకూ అంతు పట్టకుండా తీయడంలో దర్శకుడు వెంకట్ రామ్జీ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ప్రతి విషయం ప్రతి పాత్ర వెర్షన్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా ప్రతిసారీ ఆసక్తికరంగా ఉంటుంది. క్షణానికో ట్విస్ట్ వచ్చి ఆశ్చర్యపరుస్తుంది. రెజీనా, శేష్ల మధ్య డిస్కషన్స్ చాలాసేపు ఉంటాయి. కానీ ఒక్కసారి కూడా బోర్ కొట్టదు. ముఖ్యంగా హీరో పాత్ర తాలూకు వ్యక్తిత్వం మన బుర్రలకు ఏమాత్రం అందదు. ప్రతి పాత్ర చుట్టూ ఒక బలమైన కథను అల్లి, వాటన్నిటినీ ఒకచోట పద్ధతిగా పేర్చి, ఆసక్తికరంగా అందించారు. కాకపోతే మనకు తెలియకుండా కథలో లీనమై ఆలోచించేయడం వల్ల బ్రెయిన్కి ఎక్కువ వ్యాయామమే ఉంటుంది. కాస్త కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమూ ఉంది. అలా కాకుండా రిలాక్స్డ్ మైండ్తో చూస్తే ఈ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు.
ఎవరెలా?
శేష్ సినిమా అంటే అది శేష్ సినిమానే. షో మొత్తాన్నీ తనే నడిపేస్తాడు. ఈసారి అతడికి రెజీనా రూపంలో పర్ఫెక్ట్ పెయిర్ దొరికిందేమో… షో ఇంకా రక్తి కట్టింది. వీరిద్దరికీ ఏమాత్రం తగ్గకుండా నవీన్ చంద్ర అదరగొట్టేశాడు. ఇతడిది కాస్త ఫర్వాలేదు కానీ శేష్, రెజీనాలవి చాలా టఫ్ క్యారెక్టర్స్. లోపల ఏదో విషయం దాచుకుని పైకి వేరేలా కనిపిస్తున్నట్టు నటించాలి. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. శేష్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. మురళీశర్మ పాత్ర కొద్దిగానే ఉన్నా తనదైన శైలిలో మెప్పించాడు. పవిత్ర లోకేష్ కూడా ఫర్వాలేదు.
టెక్నీషియన్స్ విషయానికొస్తే… థ్రిల్లర్కి అత్యవసరమైన బ్యాగ్రౌండ్ స్కోర్ని ఇవ్వడంలో శ్రీ చరణ్ పాకాల సక్సెస్ అయ్యాడు. అసలే టెన్షన్ పెడుతోన్న కథనానికి తన సంగీతాన్ని జోడించి మరింత కంగారుపెట్టాడు. వంశీ కెమెరా వర్క్ సూపర్బ్. కీలక సన్నివేశాల్ని తన పనితనంతో అద్భుతంగా ఎలివేట్ చేశాడు. సంభాషణలతోనే సాగే సినిమా అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా రాసి తన పెన్ ఎంత పదునైనదో ప్రూవ్ చేశారు. ఎడిటింగ్ కూడా బాగుంది కానీ ఎక్కువ సన్నివేశాలను చూపించాలనే ఉద్దేశంతో కాస్త స్పీడు పెంచేశారేమో అనిపిస్తుంది. ఇక దర్శకుడు రామ్జీ ఎంట్రీలోనే తన మార్క్ చూపించేశాడు. ‘ఇన్విజిబుల్’ గెస్ట్ సినిమాని మార్చి ‘బద్లా’ తీసినా… ఆ రెండూ చూసినవారికి కూడా నచ్చేలా ఈ సినిమాని తన శైలిలోకి మార్చి మెప్పించాడు. మొత్తంగా కథలో నేరం ‘ఎవరు’ చేసినా.. ఈ సినిమాకి పని చేసినవారంతా సక్సెస్ మాత్రం సాధించారు.