
మంచిర్యాల, వెలుగు: అమెరికాలోని షికాగోలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ, ఆమె కూతురు చనిపోయారు. మంచిర్యాలలోని రెడ్డికాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి విఘ్నేశ్, రమాదేవి(52) దంపతులకు తేజస్విని(32), స్రవంతి కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ పెండ్లిళ్లు చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. తేజస్విని షికాగోలో, స్రవంతి అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో ఉంటున్నారు.
అయితే, షికాగోలో తేజస్విని గృహప్రవేశ కార్యక్రమం కోసం విఘ్నేశ్, రమాదేవి నెల రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. శుక్రవారం స్రవంతి కొడుకు ఇషాన్ బర్త్డే సెలబ్రేషన్ కోసం విఘ్నేశ్, రమాదేవి తమ కూతురు తేజస్విని, అల్లుడు, పిల్లలతో కలిసి కారులో బయలుదేరారు. షికాగో శివారులో వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తేజస్విని, రమాదేవి స్పాట్లోనే చనిపోయారు. తేజస్విని కొడుకు విహాన్కు తీవ్రగాయాలు అయ్యాయి. మిగతా వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తల్లీకూతురు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.