
- ప్రీ బిడ్ సమావేశానికి10 కంపెనీలు హాజరు
జైపూర్, వెలుగు : సింగరేణి సంస్థ చేపడుతున్న రెండో దశ సోలార్ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రీ బిడ్సమావేశం మంగళవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగింది. సింగరేణి సోలార్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణరావు, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎన్.వి.కె.శ్రీనివాస్, జనరల్ మేనేజర్(సోలార్) జానకిరామ్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న10 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు 8 చోట్ల ఏర్పాటు చేయనున్న 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మూడు టెండర్లుగా నిర్మాణ ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నిర్మాణ ప్రదేశాలను, రవాణా సౌకర్యాలను స్వయంగా పరిశీలించవచ్చని చెప్పారు.
సింగరేణి సంస్థ ఇప్పటికే మొదటి దశలో భాగంగా సోలార్ప్లాంట్ల ఏర్పాటును విజయవంతంగా పూర్తిచేసినట్లు గుర్తుచేశారు. ఈ నెల 25వ తేదీ లోపు టెండర్లు సమర్పించాలని, దక్కించుకున్న ఏజెన్సీలు ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్(మెటీరియల్ ప్రొక్యూర్మెంట్) మల్లెల సుబ్బారావు, జనరల్ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ) సుబ్బారావు, జనరల్ మేనేజర్ ఎన్.వి.కె.వి.రాజు పాల్గొన్నారు.