బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత

బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే పద్మారావుగౌడ్​ను పిలవలేదంటూ బీఆర్ఎస్​  నేతల ఆందోళన
  • సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యే రాలేదన్న కాంగ్రెస్​ నాయకులు
  • ఫ్లెక్సీలను చించేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట

సికింద్రాబాద్, వెలుగు:  సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలకు బోనాల చెక్కుల పంపిణీ ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే పద్మారావుగౌడ్​ను పిలవలేదని, ప్రోగ్రామ్​ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో లేదని బీఆర్ఎస్​శ్రేణులు ఆందోళనకు దిగారు. మంగళవారం సీతాఫల్​మండిలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసులో అధికారులు బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలతారెడ్డి పాల్గొని చెక్కులు పంపిణీకి రెడీ కాగా అప్పటికే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ను పిలవకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో కూడా వేయలేదని, కాంగ్రెస్​నాయకులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడి ఫ్లెక్సీలను బీఆర్ఎస్​నాయకులు చించేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్​నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట జరిగింది. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

కాంగ్రెస్​నేత ఆదం సంతోశ్​కుమార్ స్పందిస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, కార్పొరేటర్లకు ముందస్తుగా సమాచారం ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రొటోకాల్​పాటిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వస్తున్నారని చెబితే ఆయన వచ్చే వరకు కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపుతామన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి కలగజేసుకుని ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ లీడర్ల అభ్యంతరాన్ని స్వీకరిస్తామంటూ స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీసేయించారు. అనంతరం డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్​కార్పొరేటర్లు హేమ, సునీత, శైలజ, ప్రసన్నలక్ష్మితో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ లోని 205 ఆలయాలకు రూ.కోటి ఆరు లక్షలు ఇచ్చామన్నారు.