
- ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను పిలవలేదంటూ బీఆర్ఎస్ నేతల ఆందోళన
- సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యే రాలేదన్న కాంగ్రెస్ నాయకులు
- ఫ్లెక్సీలను చించేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలకు బోనాల చెక్కుల పంపిణీ ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను పిలవలేదని, ప్రోగ్రామ్ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో లేదని బీఆర్ఎస్శ్రేణులు ఆందోళనకు దిగారు. మంగళవారం సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ఆఫీసులో అధికారులు బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలతారెడ్డి పాల్గొని చెక్కులు పంపిణీకి రెడీ కాగా అప్పటికే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ను పిలవకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో కూడా వేయలేదని, కాంగ్రెస్నాయకులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడి ఫ్లెక్సీలను బీఆర్ఎస్నాయకులు చించేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట జరిగింది. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్నేత ఆదం సంతోశ్కుమార్ స్పందిస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, కార్పొరేటర్లకు ముందస్తుగా సమాచారం ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రొటోకాల్పాటిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వస్తున్నారని చెబితే ఆయన వచ్చే వరకు కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపుతామన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి కలగజేసుకుని ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ లీడర్ల అభ్యంతరాన్ని స్వీకరిస్తామంటూ స్టేజీ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీసేయించారు. అనంతరం డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్కార్పొరేటర్లు హేమ, సునీత, శైలజ, ప్రసన్నలక్ష్మితో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ లోని 205 ఆలయాలకు రూ.కోటి ఆరు లక్షలు ఇచ్చామన్నారు.