- శ్రీనగర్లో టెర్రరిస్టుల దారుణం.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
శ్రీనగర్: శ్రీనగర్లో డ్యూటీలో ఉన్న ఓ ప్రొబెషనరీ సబ్ఇన్స్పెక్టర్ను టెర్రరిస్టు వెనక నుంచి కాల్చి చంపాడు. ఈ దారుణం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. శ్రీనగర్లోని ఖాన్యార్ ఏరియా పోలీస్ స్టేషన్లో నార్త్కాశ్మీర్కుప్వారా జిల్లాకు చెందిన అర్షిద్ అహ్మద్ ప్రొబెషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఖాన్యార్ ఏరియాలో ఆదివారం తన టీమ్తో కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాడు. ఆ ఏరియాలో గాలిస్తుండగా.. మధ్యాహ్నం1.35 గంటల సమయంలో ఓ టెర్రరిస్టు అర్షిద్ వెనక నుంచి వచ్చి రెండు సార్లు కాల్చాడు. వీపు భాగంలో బుల్లెట్లు దిగడంతో అహ్మద్ అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే ఆయనను స్కిమ్స్ హాస్పిటల్కు తరలించినా ఫలితం దక్కలేదు. రక్తం ఎక్కువగా పోవడంతో అహ్మద్ చనిపోయారని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన ఆ ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాన్ని పరిశీలించిన పోలీసులు దాడికి పాల్పడిన టెర్రరిస్టును పట్టుకునేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాశ్మీర్ పోలీసులు చెప్పారు. అహ్మద్ మృతిపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబ ముఫ్తీ, శ్రీనగర్ మేయర్, డీజీపీ దిల్బాగ్ సింగ్ సంతాపం తెలిపారు. అహ్మద్ పార్థివ దేహానికి కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ఆఫీసర్లు నివాళి అర్పించారు.