నీళ్లపై నడుస్తయ్​..రోడ్లమీద ఉరుకుతయ్​!

నీళ్లపై నడుస్తయ్​..రోడ్లమీద ఉరుకుతయ్​!
  •     కంది మండలం మల్కాపూర్​ పెద్ద చెరువులో  బీఎంపీ- 2 యుద్ధట్యాంకుల టెస్ట్ డ్రైవ్​ 
  •     తయారు చేసిన మెదక్ ​ఆర్డెన్స్​ ​ఫ్యాక్టరీ 
  •     ఇన్​బిల్ట్​గా 30 ఎంఎం గన్,​7.62 రైఫిల్‌, మిస్సైల్ లాంచర్ 
  •     స్మోక్ గ్రెనేడ్​ లాంఛర్,  ఫైర్ ప్రొటెక్షన్ కూడా.. 

కంది, వెలుగు :   సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఓడీఎఫ్​(ఆర్డెన్స్​ ఫ్యాక్టరీ)లో తయారైన బీఎంపీ–2 యుద్ధ ట్యాంకులకు మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం టెస్ట్​ డ్రైవ్ నిర్వహించారు. ఓడీఎఫ్ జీఎం రత్నప్రసాద్, జాయింట్ జీఎం సర్జిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టెస్ట్ ​డ్రైవ్ ​జరిగింది. ముందుగా యుద్ధ ట్యాంకులకు జీఎం రత్నప్రసాద్ పూజలు చేశారు. తర్వాత ఆర్మీ ఆఫీసర్లతో కలిసి ట్యాంకులపై కూర్చొని చెరువులో ప్రయాణించారు. టెస్ట్​డ్రైవ్​ సక్సెస్​ అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ పరీక్షించిన వాటిలో బీఎంపీ కన్వర్షన్ ట్యాంకుతో పాటు బీఎంపీ ఓవరాయిలింగ్ ట్యాంక్​ ఉందన్నారు. ఒక్కోటి 14 టన్నులు బరువు ఉంటాయని, అయినా నీళ్లలో తేలుతూ ప్రయాణం చేస్తాయన్నారు.

 నీళ్లలో గంటకు 7 నుంచి 8 కిలోమీటర్లు, రోడ్డుపై గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్తాయన్నారు. నైట్ విజన్ ఫెసిలిటీ ఉన్న ఈ ట్యాంకర్లలో 30 ఎంఎం గన్​7.62 రైఫిల్‌తో పాటు మిస్సైల్ లాంచర్ ఉంటుందన్నారు. ఇందులో స్మోక్ గ్రెనేడ్ ​లాంఛర్,  ఆల్ రౌండ్ ఫైర్ ప్రొటెక్షన్ వంటి   ఫీచర్లు ఉన్నాయన్నారు. యుద్ధ ప్రాంతంలో సైనికులను తరలించడానికి ఉపయోగపడతాయని,  రష్యా టెక్నాలజీతో తయారు చేసినట్టు చెప్పారు. మెదక్​ ఓడీఎఫ్ ​నుంచి ఇప్పటివరకు 2వేలకు పైగా యుద్ధ వాహనాలను ఆర్మీకి అందజేసినట్లు చెప్పారు. ఇంకా కొన్ని పరీక్షలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో టెస్ట్​ చేసిన తర్వాతే మిలిటరీకి అందజేస్తామన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్లు వేణునాథ్, అంబటి రాంబాబు, మిలిటరీ  ఆఫీసర్లు  పాల్గొన్నారు.