
హైదరాబాద్, వెలుగు: గ్రూప్– 2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్ణయించింది. రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 783 గ్రూప్ –2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ లో పరీక్షలు జరిగాయి. 5,51,855 మంది అప్లై చేసుకోగా.. 2,49,964 మంది అటెండ్అయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులతోపాటు 2,36,649 మందికి సంబంధించిన జనరల్ ర్యాకింగ్ లిస్టులను ఈ ఏడాది మార్చి లో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వారిలో రిజర్వేషన్లకు అనుగుణంగా 1:1 కేటగిరీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని కమిషన్ భావిస్తున్నది.
రెండు వారాల పాటు ప్రక్రియ..
గ్రూప్–2 కంటే ముందే టీజీపీఎస్సీ 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్–1 ఫలితాలను రిలీజ్చేసింది. మెయిన్స్ కు 21,093 మంది అటెండ్ అయితే, వారిలో 12,622 మంది క్వాలిఫై అయ్యారు. గ్రూప్– 1 పోస్టుల భర్తీ తర్వాతే గ్రూప్ –2 పోస్టులను నింపాలని భావించిన టీజీపీఎస్సీ.. ముందుగా గ్రూప్ –1 క్యాండిడేట్ల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తిచేసింది. అయితే, గ్రూప్ –1పై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. వచ్చే నెల రెండోవారంలో హియరింగ్ కు రానున్నది. ఈ గ్యాప్లో గ్రూప్– 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని టీజీపీఎస్సీ భావించింది. దానికి అనుగుణంగా ఈ నెలాఖరులోపు 1: 1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని డిసైడ్ అయింది.
సుమారు 2 వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నది. కాగా, గ్రూప్ –2 ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టు ఇవ్వాలా? వద్దా? అనేది గ్రూప్ –1 పై హైకోర్టు తీర్పు తర్వాత టీజీపీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. చాలామంది అభ్యర్థులు గ్రూప్–1, గ్రూప్–2 కు సెలెక్ట్ అయ్యారు. ఒకవేళ ముందుగా గ్రూప్– 2 సెలెక్షన్ లిస్టు రిలీజ్ చేస్తే.. వారు జాయిన్ అయిన తర్వాత గ్రూప్–1 వస్తే మళ్లీ అటు వైపే వెళ్లే అవకాశం ఉంది. దీంతో పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నది. దీనిపై సర్కారుతో సంప్రదించి, ఆ తర్వాతే గ్రూప్ –2పై నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది.