థాయిలాండ్ రాజకీయాల్లో కొత్త మలుపు. శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కనబెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకుమారి ఉబోల్ రత్న. ప్రస్తుతం రాజకుమారి హోదాలో ఉన్న ఆమె… ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సియామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న ఫస్ట్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ గా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు ఉబోల్ రత్న.
థాయిలాండ్ రాజకుమారి ఉబోల్ రత్న రాజకన్య సిరివధన బర్నవడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. 67 ఏళ్ల ఉబోల్ రత్న… థాయిలాండ్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. థాయి రక్స చార్ట్ పార్టీ తరపున ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తరపున పార్టీ సభ్యులు నామినేషన్ కూడా వేసేశారు.
ప్రస్తుత థాయిలాండ్ రాజు మహా వజిరలోంగ్ కోర్న్ కు ఉబోల్ రత్న అక్క. వీరి తండ్రి భూమిబోల్ అదుల్యదేజ్. ఆయన 2016లో చనిపోయారు. 1932లో థాయిలాండ్ లో ఎన్నికల ప్రక్రియ ఏర్పడ్డాక.. రాజకుటుంబీకులెవరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. దాదాపు 87 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాలను ఉబోల్ రత్న బ్రేక్ చేశారు. థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్న ప్రయుత్ చాన్ ఓ ఛా మరోసారి ప్రధాని బరిలోకి దిగారు. ఆయనే ఉబోల్ రత్నకు ప్రధాన ప్రత్యర్థి.
రాజకుమారి ఉబోల్ రత్న తన జీవితంలో అనేక సంచలనాలకు వేదికగా నిలిచారు. ఆమె స్విట్జర్లాండ్ లో పుట్టింది. అమెరికాలోని మసాచ్చుసెట్స్ యూనివర్సిటీలో చదువుకుంది. 1972లో తోటి విద్యార్థి పీటర్ లాడ్ జెన్సెన్ ను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఉబోల్ రత్న 1998లో విడాకులు తీసుకొని 2001లో థాయిలాండ్ కు వచ్చింది. అప్పట్నుంచి రాజకుటుంబ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకుటుంబం తరపున అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనేవారు.
ఉబోల్ రత్న ప్రధానమంత్రిగా ఎన్నికతై… రాజకుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తిగా మరో రికార్డ్ సృష్టిస్తారు.
