వీర‌జ‌వాన్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

వీర‌జ‌వాన్  కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమ‌రావ‌తి: జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురుకాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో వీర మరణం పొందారు.

దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం ‌ జగన్..  ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ఒక లేఖ రాసిన సీఎం ‌ జగన్, ఆ సహాయం స్వీకరించాలని కోరారు