తహసీల్దార్​ బెదిరిస్తున్నారంటూ ఆత్మ హత్యాయత్నం

తహసీల్దార్​ బెదిరిస్తున్నారంటూ ఆత్మ హత్యాయత్నం

మహబూబాబాద్అర్బన్, వెలుగు: డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు వార్డు కౌన్సిలర్, తహసీల్దార్​తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వేకువజామున ఫేస్​బుక్​లో లైవ్​పెట్టి పురుగుల మందు తాగాడు. బాధితుడి ఫేస్​బుక్ ​పోస్టుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొడ్రాల విజయ్(30) కారు డ్రైవర్. కులాంతర వివాహం చేసుకున్న విజయ్​కు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల క్రితమే అతని తండ్రి యాక్సిడెంట్​లో చనిపోగా, తల్లి రంగమ్మ అతని వద్దే ఉంటోంది. సొంతిల్లు లేని విజయ్ జిల్లాలోని గుమ్ముడూర్​లోని నిర్మించిన డబుల్​బెడ్​రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇల్లు రాలేదు. దాంతో ‘‘నాకు సెంటు భూమి లేదు. కులాంతర వివాహం చేసుకున్నాను. తల్లి వితంతువు. అయినప్పటికీ నాకు డబుల్ బెడ్​రూం కేటాయిండం లేదు. తహసీల్దార్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. ఇల్లు ఉన్నోళ్లు, డబ్బులున్నోళ్లకే ఇళ్లు కేటాయిస్తున్నారు. తహసీల్దార్ రంజిత్​కుమార్, వార్డు కౌన్సిలర్ జనార్దన్, మరికొందరితో కలిసి ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడుతున్నారు” అంటూ ఐదు రోజుల క్రితం విజయ్​ ఫేస్​బుక్​లో పోస్టు పెట్టాడు. దాన్ని తొలగించకపోతే చంపేస్తామంటూ తహసీల్దార్ రంజిత్ కుమార్, కౌన్సిలర్ ​జనార్దన్​ ఫోన్​చేసి బెదిరించారు. దాంతో విజయ్ ​మంగళవారం వేకువజామున ఫేస్​బుక్​ లైవ్​పెట్టి జరిగింది వివరించాడు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోతున్నానని విజయ్ ​చెప్పాడు. తహసీల్దార్, వార్డు కౌన్సిలర్​తన చావుకు కారణమని అందులో తెలిపాడు. ఆ వీడియో చూసిన విజయ్​ఫ్రెండ్స్​ అతని వద్దకు వెళ్లి మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్​కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం విజయ్​ పరిస్థితి క్రిటికల్​గా ఉందని అతని ఫ్రెండ్స్​ తెలిపారు.