ముంబైలో హైఅలర్ట్‌

ముంబైలో హైఅలర్ట్‌

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు సెలవులు రద్దుచేసిన డీజీపీ

మహారాష్ట్ర రాజకీయాలను లౌడ్ స్పీకర్ల వ్యవహారం కుదుపేస్తోంది. మహావికాస్ అఘాడీ సర్కారుకు రాజ్ ఠాక్రే విధించిన డెడ్ లైన్ నేటితో ముగిసింది. దీంతో ముంబైలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన ప్రకటనతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాజ్ ఠాక్రేపై పలు కేసులు నమోదయ్యాయి. రాజ్ ఠాక్రేను బీజేపీ వెనుకుండి నడిపిస్తోందని మహా వికాస్ అఘాడీలోని శివసేన ఆరోపిస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ అస్థిరతే కమలనాథుల లక్ష్యమని మండిపడుతోంది. అధికారం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము ఈ తరహా బెదిరింపులకు భయపడబోమని హెచ్చరించింది. 

మసీదులపై లౌడ్‌స్పీకర్ల నుంచి ఆజాన్‌ వినిపిస్తే ప్రతిగా హనుమాన్‌ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్‌ థాక్రే హెచ్చరించారు. మసీదులపై లౌడ్‌స్పీకర్లను తొలగించాలంటూ (ఈ నెల3వ తేదీ వరకు) డెడ్‌లైన్‌ విధించారు. ఆజాన్‌ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. రాజ్ ఠాక్రే విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్‌ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్‌ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్‌ స్పీకర్లు బంద్‌ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్‌ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి లౌడ్‌స్పీకర్లు బంద్‌ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు.

రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రాజ్‌థాక్రేపై ఔరంగాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్‌థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు మహారాష్ట్ర డీజీపీ సెలవులు రద్దు చేశారు. 

థాక్రే వర్సెస్‌ థాక్రే
మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్‌ స్పీకర్ల వ్యవహారంతో మరింత ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్‌ఎస్‌ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంకుతో సేన ఓట్లను ఎంఎన్‌ఎస్‌ ద్వారా చీల్చే ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది.

 

 

 

మరిన్ని వార్తల కోసం..

 

గ్రూప్​ వన్​ ఎగ్జామ్​ ఉర్దూలో ఎట్ల పెడతరు?

పలు జిల్లాల్లో కుండపోత వర్షం