చివరి చూపుకు వెల కట్టారు
కన్నీరుమున్నీరైన కరోనా పేషెంట్ కొడుకు
పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో సంఘటన
పోలీసులు కోరినా చూపించలేదన్న కుటుంబీకులు
కోల్కతా: ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఓ వ్యక్తి చనిపోతే.. పైసలిస్తే గానీ చివరి చూపు చూపించబోమని కుటుంబ సభ్యులకు హాస్పిటల్ వాళ్లు తెగేసి చెప్పారు. పైసలు కట్టకపోయేసరికి చూపించకుండానే అంత్యక్రియలు చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఆదివారం జరిగిందీ సంఘటన. కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ శనివారం రాత్రి హరి గుప్తా చనిపోయారు. హాస్పిటల్ వాళ్లు తమకు ఆ మరుసటి రోజు చెప్పారని హరి గుప్తా కొడుకు సాగర్ గుప్తా చెప్పారు. చనిపోయినప్పుడే ఎందుకు చెప్పలేదని అడిగితే నంబర్ లేదని జవాబిచ్చారని అన్నారు.
వెంటనే తాము హాస్పిటల్కు వెళ్లగా.. మృతదేహాన్ని అంత్యక్రియలకు పంపినట్లు చెప్పారన్నారు. చివరి చూపు చూసుకునేందుకు పరుగు పరుగున షిబ్పూర్ శ్మశానవాటికకు చేరుకుంటే హాస్పిటల్ సిబ్బంది రూ. 51 వేలు కడితేనే చూపిస్తామని డిమాండ్ చేశారన్నారు. ఆ తర్వాత కాస్త తగ్గించి రూ. 31 వేలు అడిగారని తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని, వెంటనే అక్కడికి వచ్చిన ఓ పోలీసు అధికారిని కూడా ఆస్పత్రి సిబ్బంది లెక్క చేయలేదని అన్నారు. ఆయన పదే పదే అడిగినా కూడా ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పారన్నారు. ఈ సంఘటననంతా రికార్డు చేయడానికి ట్రై చేయగా తమ ఫోన్ను లాక్కున్నారని బాధిత కుటుంబీకులు చెప్పారు. ఇంత జరిగినా కూడా చివరకు తమకు చూపిం చకుండానే మృతదేహాన్ని దహనం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. హాస్పిటల్ వాళ్లు మాత్రం ఫ్యామిలీ కాంటాక్ట్ అడ్రస్ తెలియకనే డెడ్ బాడీని అంత్యక్రియలకు తరలించామని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబీకులు సిద్ధమవుతున్నారు.