
- కంసాన్పల్లిలో 1,024 ఎకరాల సర్కారు ల్యాండ్పై వివాదం
- వందేళ్లుగా సాగు చేసుకుంటున్న 300 కుటుంబాలు
- ఇండస్ట్రీయల్పార్క్ఏర్పాటు చేస్తామంటున్న సర్కారు
- రైతులు ఆందోళనకు దిగడంతో 200 ఎకరాలు ఇస్తామని ప్రపోజల్స్
- ఎవరికిస్తారో చెప్పాలని నెల రోజులుగా దీక్షలు చేస్తున్న బాధితులు
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా దామరిగిద్ద మండలంలోని కంసాన్పల్లి భూవివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రైతులు వందేళ్లుగా సాగు చేసుకుంటున్న 1,024 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులు ఆందోళనకు దిగడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు 200 ఎకరాలకు పట్టాలు ఇస్తామని ప్రపోజల్స్ పెట్టారు. కానీ, ఇప్పటి వరకు ఆఫీసర్లు సర్వే చేసింది లేదు.. అర్హులను ఎంపిక చేసింది లేదు. కాగా, అసలు రైతులకు బదులు టీఆర్ఎస్ నేతల పేర్లను లిస్టులో చేరుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరికిస్తారో చెప్పాలని 30 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు.
50 ఏళ్లుగా సాగులో..
కంసాన్పల్లిలోని 229 సర్వే నంబర్లోని 1,024 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఈ భూమిని గ్రామానికి చెందిన 300 రైతు కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. గత పాలకులు పట్టాలివ్వాలని ప్రయత్నించినా రెవెన్యూ రికార్డులో అటవీశాఖకు చెందిన భూమిగా ఉండడంతో సాధ్యపడలేదు. కొన్నేళ్ల క్రితం సీపీఎం నాయకులు ఈ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు దరఖాస్తు పెట్టడంతో తమ వద్ద వివరాలు లేవని సమాధానం వచ్చింది. దీంతో భూమి రెవెన్యూ శాఖదేనని నిర్ధారణ కావడంతో రైతులు పట్టాలివ్వాలని కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కూడా ప్రతి ఎన్నికలప్పుడు పట్టాలిస్తామని హామీ ఇస్తున్నారు.
భూసేకరణ వివాదాస్పదం
కంసానిపల్లిలోని 1,024 ఎకరాలు స్థలం సర్కారుదేనని తేలడంతో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏడాది క్రితం భూసేకరణ చేపట్టారు. రైతులు ఆందోళకు దిగడంతో పెండింగ్లో పెట్టారు. కాగా, ఇటీవల ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నారాయణపేట పర్యటన సందర్భంగా కంసాన్పల్లిలోని 229 సర్వేనంబర్లో 200 ఎకరాలకు పట్టాలివ్వాలని, మిగిలిన భూమిలో ఇండస్ట్రీయల్పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. దీనికి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.
200 ఎకరాలు ఎవరికిస్తరు?
1,024 ఎకరాలను సాగు చేస్తుంటే కేవలం 200 ఎకరాలు ఇస్తామనడంపై రైతులు ఆందోళనకు దిగారు. ఎంతమందికి ఇస్తారో లబ్ధిదారుల లిస్టు రిలీజ్ చేయాలని దామరిగిద్ద తహసీల్దార్ ఆఫీస్ ఎదుట 30 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే పట్టాలిప్పిస్తానని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారని, ఆయన సూచన మేరకే టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా సర్పంచ్గా గెలిపించామని చెబుతున్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన నేతలకు ఇచ్చేందుకు 200 ఎకరాలు ప్రతిపాదించారని ఆరోపిస్తున్నారు. కాగా, రెవెన్యూ ఆఫీసర్లు అప్లికేషన్లు పెట్టుకోవాలని సూచించడంతో ధర్నాకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
అందరికీ న్యాయం చెయ్యాలె
229 సర్వేనంబర్లోని భూమిని సాగుచేసుకుంటున్న రైతులందరికీ న్యాయం చేయాలి. వందేళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని ఇండస్ట్రీయల్ పార్క్ కోసం తీసుకోవడం సరికాదు. అందరికీ పట్టాలిచ్చాక మిగిలిన భూమిని ఏమన్నా చేసుకోండి.
- గోపాల్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి
మాట నిలబెట్టుకోవాలి
ప్రజాప్రతినిధులు మాకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తాతల కాలం నుంచి ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నం. ఇప్పుడు దాన్ని గుంజుకుంటే చావు తప్ప వేరు దిక్కు లేదు. ప్రభుత్వం పట్టాలిచ్చి మమ్మల్ని ఆదుకోవాలె.
- జింక గోవింద్, రైతు