హైదరాబాద్, వెలుగు : ‘‘లిక్కర్ డీ ఎడిక్షన్ సెంటర్స్ ను జిల్లాకొకటి ఏర్పాటు చేస్తామని 2013లో జీవో జారీ చేశారు. ఆ జీవో అమలు చేయకపోవడాన్ని సవాలు చేసిన రిట్ పిటిషన్లో ఆరేండ్లుగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు. అంత తీరిక కూడా లేదా..?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఈసారి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోతే తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని పలువురు ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఎక్సైజ్, మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎక్సైజ్ శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. 3వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే వచ్చే విచారణకు అందరూ వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాకొకటి లిక్కర్ డీ ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని 2013లో ప్రభుత్వం జీవో 358 జారీ చేసింది. దీన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ అడ్వకేట్, సోషల్ వర్కర్ మామిడి వేణు మాధవ్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2016 నాటి రిట్ పిటిషన్లో ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. ఇటీవల జరిగిన విచారణకు ప్రభుత్వం తరఫున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ కూడా హాజరుకాలేదు. దీంతో అడ్వకేట్ వేణు మాధవ్ కల్పించుకుని, ఆరేండ్లకు పైగా రాష్ట్ర సర్కార్ కౌంటర్ కూడా వేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్లీ మళ్లీ వాయిదాలు వేసేది లేదని తేల్చి చెప్పింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.