రజత్కుమార్ కుమార్తె పెళ్లి అంశంపై ఢిల్లీ హైకోర్టు విచారణ

రజత్కుమార్ కుమార్తె పెళ్లి అంశంపై ఢిల్లీ హైకోర్టు విచారణ

ఐఏఎస్‌ అధికారి రజత్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రజత్ కుమార్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)ని ప్రశ్నించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంపై సీరియస్‌ అయ్యింది. రజత్‌కుమార్‌ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులనుప్రైవేట్‌ కాంట్రాక్టర్లు చెల్లించారనే ఆరోపణలు రావడంతో పలువురు ఆయనపై చర్యలు తీసుకోవాలని డీవోపీటికి ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ సీఎస్ కు పంపడంతో గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. స్పెషల్ సీఎస్ స్థాయి అధికారిపై సీఎస్ ఎలా చర్యలు తీసుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని డీఓపీటీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేసింది.

బిగ్​వేవ్​ ఇన్​ఫ్రా పేరిట..

హైదరాబాద్​లోని పేరొందిన స్టార్ హోటళ్ల  వేదికగా ఐదు రోజులపాటు రజత్ కుమార్ తన కూతురు పెండ్లి  వేడుక నిర్వహించారు. డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూముల ఏర్పాట్లను మేఘా కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు ఈ మెయిల్, ఇన్ వాయిస్ డేటాను ‘ది న్యూస్ మినిట్’ ఆధారాలతో సహా ప్రచురించింది. 

తాజ్ హోటల్ గ్రూపునకు బిగ్ వేవ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. మేఘాకు చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని, అందుకే ఈ పెండ్లి ఏర్పాట్లు, బిల్లులతో మేఘా కంపెనీకి సంబంధం ఉందని బయటపెట్టింది. స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకరరావు, ఇద్దరు మేఘా ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్డినేట్ చేసినట్లు తెలిపింది. పెండ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూమ్స్​ను బుక్​ చేశారని, నిరుడు జూలై 31న  బుకింగ్స్​​ కోసం హోటళ్లకు మెయిల్స్​ వెళ్లాయని, అంతకు ఒక్క నెల ముందు (జూలై 1న) బిగ్​ వేవ్​ ఇన్​ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ‘ది న్యూస్​ మినిట్​’ వివరించింది. కంపెనీ అడ్రస్​ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. 

ఒక్కో ప్లేట్​కు రూ. 16,520..

డిసెంబరు 20న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ. 16,520 చొప్పున బిల్లింగ్ అయిందని స్టోరీలో ‘ది న్యూస్​ మినిట్’ పేర్కొంది. ఎప్పుడు ఏం జరిగింది ? ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి ? వంటి పలు విషయాలను ప్రస్తావించింది. అయితే వీటిలో నిజాలు లేవని, తన కూతురి పెండ్లి ఏర్పాట్లు తానే స్వయంగా చేసుకున్నానని వెబ్​సైట్​కు రజత్ కుమార్​ వివరణ ఇచ్చారు. ‘ మా కంపెనీకి, ఆ పెండ్లికి సంబంధం లేదు. వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది మా కంపెనీకి అంటగట్టడం సరైంది కాదు’ అని తమ స్టోరీ పబ్లిష్ అయిన వెంటనే మేఘా కంపెనీ వివరణ ఇచ్చిందని ‘ది న్యూస్ మినిట్’ పేర్కొంది. స్టోరీ పబ్లిషింగ్​కు ముందు వివరణ అడిగితే కంపెనీ ఇవ్వలేదని, పబ్లిష్​ అయిన తర్వాత వివరణ ఇచ్చినట్లు తెలిపింది.