భార్యను సంవత్సరం పాటు టాయిలెట్‌లో బంధించిన భర్త

భార్యను సంవత్సరం పాటు టాయిలెట్‌లో బంధించిన భర్త

కట్టుకున్న భర్త కోసం.. కనిపెంచిన వాళ్లని వదులుకొని భర్త ఇంట్లో అడుగుపెడుతుంది మహిళ. భర్తే సర్వస్వంగా భావించి అతనితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అలాంటి భార్యను కట్టుకున్నవాడే దుర్మార్గంగా బాధపెట్టిన ఘటన హర్యానాలో జరిగింది. రిష్పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళను ఆమె భర్త సంవత్పరం నుంచి టాయిలెట్‌లో బంధించాడు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే బంధించానని ఆమె భర్త నరేష్ చెప్పుకొచ్చాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహిళా రక్షణ అధికారి రజనీ గుప్తా బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి సదరు మహిళను రక్షించారు.

‘ఒక మహిళ సంవత్సరం నుంచి టాయిలెట్‌లో లాక్ చేయబడిందని నాకు సమాచారం అందింది. నేను నా బృందంతో ఇక్కడకు వచ్చాను. మేం ఇక్కడికి వచ్చిన తర్వాత అది నిజమేనని తేలింది. ఆమెను చూస్తే చాలా రోజులుగా ఏం తినలేదని అర్ధమవుతోంది. ఆమె మానసికంగా బాధపడుతోందని ఆమె భర్త చెప్పాడు. కానీ అది నిజం కాదు. మేం ఆమెతో మాట్లాడితే.. ఆమెకు మానసికంగా ఎటువంటి సమస్యా లేదని స్పష్టమైంది. అయితే ఆమె మానసికంగా ఇబ్బందిపడుతుందో లేదో అనేది ఇప్పుడే ధృవీకరించలేం. కానీ, ఆమె మరుగుదొడ్డిలో లాక్ చేయబడిందనేది మాత్రం వాస్తవం. మేం ఆమెను రక్షించి.. జుట్టు కడిగి, స్నానం చేయించాం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అని రజనీ గుప్తా అన్నారు.

బాధితురాలి భర్త మాత్రం తన భార్య మానసికంగా సరిగా లేదని తెలిపాడు. ‘ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. మేం ఆమెను బయట కూర్చోమని ఎన్నోసార్లు అడిగాం. కానీ, ఆమె మాత్రం బయట కూర్చోవడానికి ఇష్టపడటంలేదు. మేం ఆమెను వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాం. అయినా కూడా ఆమె మానసిక స్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు’మహిళ భర్త నరేష్ తెలిపాడు.

‘రజనీ గుప్తా రిష్పూర్ గ్రామానికి వెళ్లి ఒక సంవత్సరానికి పైగా భర్త చేత లాక్ చేయబడిన మహిళను రక్షించారు. రజనీ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. త్వరలోనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాము. ఆ మహిళ మానసికంగా అస్థిరంగా ఉందని చెబుతున్నారు. మేం డాక్టర్ల సలహా తీసుకొని కేసును దర్యాప్తు చేస్తాం’అని స్థానిక పోలీసు అధికారి చెప్పారు.

For More News..

ఆడియో: వరదలో కొట్టుకుపోతూ కాపాడాలంటూ ఫోన్‌లో వెంకటేష్ చివరి మాటలు

తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు

పండక్కి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. మరి నో కాస్ట్ ఈఎంఐ బెటరా? బై నౌ పే లేటర్ బెటరా?