ముదిరాజ్​లను మోసం చేస్తున్నరు : ఎర్రశేఖర్

ముదిరాజ్​లను మోసం చేస్తున్నరు : ఎర్రశేఖర్

నారాయణపేట, వెలుగు: రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లు ఉన్న ముదిరాజ్​లకు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లివ్వని పార్టీలను బొంద పెట్టాలని ముదిరాజ్​ సంఘం నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ముదిరాజ్​ సంఘం జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  ముందుగా సింగారం చౌరస్తా నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్  సంఘ నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్​లను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని,  చేపలు పట్టడం వరకే పరిమితం చేస్తూ మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజ్యాధికారం కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. పక్క రాష్ట్రాల్లో బీసీలు సీఎం అవుతుంటే, రాష్ట్రంలో అవకాశం ఉన్నా ఎందుకు సీఎం పదవి చేపట్టలేకపోతున్నారనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్​ మాట్లాడుతూ బీసీలను బీఆర్ఎస్​ పార్టీ చులకనగా చూస్తుందన్నారు. ఏ పార్టీ ముదిరాజ్​లను గౌరవిస్తుందో, ఆ పార్టీని ఆదరించాలన్నారు. లల్లూ, సూగప్ప, కృష్ణ, పెద్ద విజయ్​కుమార్, సరాఫ్​ నాగరాజ్, కోళ్ల వెంకటేశ్, కొనంగేరి హన్మంతు, లక్ష్మణ్, మిర్చి వెంకటయ్య, పుట్టి ఈదప్ప, శెర్నపల్లి రాములు పాల్గొన్నారు.