హైదరాబాద్, వెలుగు: బడుల్లో నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ నూతన విద్యా విధానంతో టీచర్లకు, పిల్లలకు మేలు జరుగుతుందని అన్నారు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు– మనబడి’ కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్న పరికరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ను మంత్రి పర్యవేక్షించారు. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మహబూబియా స్కూల్ను సందర్శించారు. పథకం అమలులో భాగంగా స్కూల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ విద్యారంగంలో మార్పులు జరుగుతాయని, స్టూడెంట్లు అందరూ సర్కారు స్కూళ్లలో జాయిన్ కావడానికి ఆసక్తి చూపుతారని అన్నారు.
ఇద్దరు స్టూడెంట్లకు సాయం
ఐఐటీ, మెడిసిన్ సీట్లు సాధించిన సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన పి. అనిల్ కుమార్, వి. ప్రశాంత్ రెడ్డి అనే ఇద్దరు స్టూడెంట్లకు కేటీఆర్ తోడ్పాటునందించారు. బుధవారం వారిని బేగంపేట క్యాంపు ఆఫీస్కు పిలిపించి ట్యూషన్, హాస్టల్ తదితర ఫీజులకు అయ్యే మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. వాళ్ల ఫీజులన్నీ తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు.