
- గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు..
- విసిగి వేసారి ఆరు రోజుల తర్వాత ఆత్మహత్య
- హనుమకొండ జిల్లా అన్నసాగర్లో ఆలస్యంగా వెలుగులోకి..
హనుమకొండ, వెలుగు: రూ.కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చినా కొడుకులు అన్నం పెట్టకపోవడంతో 90 ఏళ్ల వృద్ధుడు జీవతంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అన్నసాగర్ గ్రామంలో ఈ నెల 1న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నసాగర్ గ్రామానికి చెందిన మొట్టె బొందయ్య (90)కు పదెకరాల పొలం ఉంది. ఇద్దరు కొడుకులకు ఆస్తి పంచాడు. అతడి భార్య ఉత్తరమ్మ కొన్నేండ్ల కింద చనిపోగా అప్పటినుంచి కొడుకుల వద్దే ఉంటున్నాడు.
అయితే కొడుకులు తనను సరిగా చూసుకోవడం లేదని, అన్నం కూడా పెట్టడం లేదని గత నెల 24న బొందయ్య హనుమకొండ కలెక్టరేట్కు వచ్చి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. మందు తాగి చావాలంటూ బూతులు తిడుతున్నారని, వారి మీద చర్య తీసుకుని తనకు అన్నం పెట్టే ఏర్పాట్లు చేయాలని కోరారు. కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్, హసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
ఆరు రోజులకు ఆత్మహత్య
ఏం జరిగిందో కానీ జులై 1న బొందయ్య ఉరి వేసుకున్నాడు. తన తండ్రి ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడని అతడి కొడుకు రాజమొగిలి హసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కీళ్లు, మెడ నొప్పితో బాధపడుతున్న బొందయ్య మందులు కూడా వాడుతున్నాడని చెప్పాడు. కీళ్లనొప్పులతో సరిగా నడవలేని వృద్ధుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకోవడంపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బొందయ్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హసన్పర్తి సీఐ జవ్వాజీ సురేశ్ చెప్పారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బొందయ్య గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదు మీద వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉండగా అతడి దరఖాస్తు 15 రోజులైనా ఆఫీసర్ల టేబుల్ మీదే ఉండిపోయింది.
మూడు రోజుల కింద దరఖాస్తు తమకు చేరిందని, కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వలేదని హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్ చెప్పారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆఫీసర్లు స్పందించకపోవడం వల్లే బొందయ్య చనిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.