తెలంగాణ కోసం కొట్లాడి..తండ్రి కాకా బాటలో రాజకీయాల్లోకి వివేక్​ వెంకటస్వామి

తెలంగాణ కోసం కొట్లాడి..తండ్రి కాకా బాటలో రాజకీయాల్లోకి వివేక్​ వెంకటస్వామి
  • 2009లో  పెద్దపల్లి ఎంపీగా గెలుపు.. 2014 వరకు సేవలు
  • కాంగ్రెస్​ ఎంపీలతో కలిసి తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి
  • 2023లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపు..మంత్రిగా చాన్స్

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన చెన్నూర్​ ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకట్​స్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్​ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది.  ప్రముఖ  కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి (కాకా),  కళావతి దంపతుల చిన్న కొడుకు వివేక్ వెంకటస్వామి. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌‌‌‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో  ఎంబీబీఎస్​ చదివారు. ఆదినుంచీ ప్రజా సేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్.. ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు.  తండ్రి గడ్డం వెంకటస్వామి (కాకా) బాటలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 

2009లో రాజకీయ ప్రస్థానం మొదలు

తండ్రి కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి  పెద్దపల్లి లోక్​సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి2014  మధ్య 15వ లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డిని ధిక్కరించి, ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని, అరెస్టయ్యారు. వీ 6 చానల్​ ను ప్రారంభించి, ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు

తెలంగాణ ఏర్పాటు చేయకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నదనే ఆగ్రహంతో కాంగ్రెస్​ను వీడి  2013 లో టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం ​ తెలంగాణ ప్రకటించడంతో 2014లో సొంత పార్టీకి తిరిగి వచ్చారు. 2016లో టీఆర్ఎస్​లో చేరారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్​గా వివేక్​ ఎన్నికయ్యారు. 2019లో బీజేపీలో చేరిన వివేక్​వెంకటస్వామిని పార్టీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నది.  

2023 నవంబర్ 21 న బీజేపీని వీడి కాంగ్రెస్​లో చేరిన వివేక్​వెంకటస్వామి.. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన  విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్​ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గెలిచిన తన కొడుకు గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నారు.