కొత్త మంత్రులుగా ముగ్గురు..వివేక్​ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారు

కొత్త మంత్రులుగా ముగ్గురు..వివేక్​ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారు
  • జూన్​ 8న మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య ప్రమాణం
  • కేబినెట్​ విస్తరణకు కాంగ్రెస్​ హైకమాండ్​ ఓకే
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు చేరుకున్న గవర్నర్​ జిష్ణుదేవ్​
  • ప్రమాణ స్వీకారం కోసం రాజ్​భవన్​లో ఏర్పాట్లు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర కేబినెట్​ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య మంత్రులుగా ముగ్గురు ప్రమాణం చేయనున్నారు. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​ , మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. వీరి పేర్లను కాంగ్రెస్​ హైకమాండ్ శనివారం రాత్రి ఖరారు చేసింది. ముగ్గురితో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్​భవన్​ వర్గాలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రివర్గంలో పేర్లు ఉన్నవారికి ఆదివారం ఉదయంలోపు సీఎంవో నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్లనుంది.

మరో మూడు పెండింగ్​

రాష్ట్ర కేబినెట్​లో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం మూడు బెర్త్​లను భర్తీ చేయనున్నారు. ఆదివారం మృగశిర కార్తె కావడం, మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన మూడు  బెర్త్​లను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడినట్టు తెలిసింది.

శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గవర్నర్​ హైదరాబాద్​కు బయలుదేరారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న మూడు మంత్రి పదవుల్లో ఎస్సీ మాల (వివేక్​ వెంకటస్వామి), ఎస్సీ మాదిగ (అడ్లూరి లక్ష్మణ్​), బీసీ ముదిరాజ్ (వాకిటి శ్రీహరి)కు దక్కాయి. కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్  సమావేశమై.. కేబినెట్​ విస్తరణపై చర్చించారు. అనంతరం విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​కు తెలియజేశారు. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే , అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించారు.