- రెండేండ్ల కాలపరిమితి.. పాలక మండలిలో ప్రముఖులకు పెద్దపీట
- సభ్యులుగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయారాజం, తూళ్ల విజయేందర్ గౌడ్
- బోర్డులో సామాజిక, ప్రాంతీయ బ్యాలెన్స్
- అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన పాలక మండలిని ( వైటీడీ బోర్డు) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చారిటెబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 2025 లోని సెక్షన్ 96(1) ప్రకారం ఈ నూతన బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది అయిన డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి (ఎంఎస్ఎన్ రెడ్డి)ని నియమించింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, నూతన పాలక మండలి పదవీ కాలం నియామకమైన తేదీ నుంచి రెండేండ్లపాటు అమలులో ఉంటుంది.
అన్ని రంగాలవారికి చోటు
బోర్డు చైర్మన్గా నియమితులైన డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి పారిశ్రామిక సేవా రంగాల్లో ఎంతో అనుభవం ఉన్నది. ఉస్మానియా, పాలమూరు వర్సిటీలనుంచి కెమిస్ట్రీ, ఫార్మా రంగ సేవలకుగానూ డ్యుయెల్ పీహెచ్డీలు పొందిన ఆయన, 2003లో స్థాపించిన ‘ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ను ప్రపంచస్థాయి సంస్థగా నిలిపారు. ‘ఉద్యోగ్ రతన్’ అవార్డును పొందారు. ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయన నాయకత్వంలో యాదగిరిగుట్ట దేవస్థానం అత్యుత్తమ సేవలు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ బోర్డు నియామకాల్లో సామాజిక సమతుల్యతను, వివిధ రంగాల ప్రతినిధుల భాగస్వామ్యాన్ని అత్యంత సమర్థవంతంగా సమన్వయం చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
బోర్డు సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం సతీమణి చిలప్పగారి విజయారాజంతోపాటు ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు తూళ్ల విజయేందర్గౌడ్కు ప్రాధాన్యత లభించింది. వీరితోపాటు ప్రాంతీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ఉమ్మడి నల్గొండకు చెందిన గుండు మల్లయ్య, ఉమ్మడి వరంగల్కు చెందిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, స్వాతి కాంతామణి, ఎం. రాఘవేందర్ రావును సభ్యులుగా నియమించి సామాజిక సమతుల్యతను పాటించింది.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నతాధికారులు
ఆలయ సమగ్ర పర్యవేక్షణ పటిష్టమైన నిర్వహణ కోసం నూతన పాలక మండలిలో ఫౌండర్ ట్రస్టీతో పాటు పలువురు ఉన్నతాధికారులను ఎక్స్- అఫీషియో సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ కమిషనర్, యాదాద్రి కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ప్రధాన అర్చకులు (స్థానాచార్య) ఈ బోర్డులో కీలక ఎక్స్- అఫీషియో సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ మినహా మిగిలిన నామినేటెడ్ సభ్యులు రెండేండ్లపాటు సేవలందిస్తారు. నూతన చైర్మన్, సభ్యులతో దేవస్థాన ఈవో త్వరలోనే ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
