మొగుళ్లపల్లి, వెలుగు: తమ ఊరి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే లక్ష్యంతో పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ బడికే పంపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరమెట్ల గ్రామస్తులు నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై మంగళవారం గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సర్పంచ్ వైనాల ధనలక్ష్మి, ఉపసర్పంచ్ పొన్నాల విజేందర్ తెలిపారు. గ్రామసభ తీర్మానాన్ని పట్టించుకోకుండా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపితే ప్రస్తుతం పొందుతున్న ప్రభుత్వ పథకాల లబ్ధిని రద్దు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. పిల్లల విద్యా నాణ్యత మెరుగుపర్చేందుకు పాఠశాలలో చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఇద్దరిని ప్రైవేట్ టీచర్లుగా అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్ని వసతులు, నైపుణ్యం గల టీచర్లతో బోధన అందిస్తున్న సర్కార్ బడిలోనే పిల్లలను చేర్పించాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు.
