ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ఈ నెల 13న ప్రారంభం కానుంది. 476 మీటర్ల పొడవులో 359 మీటర్ల ఎత్తులో విల్లు ఆకారంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జి్.. .. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించనుంది. ఈ వంతెన ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉధంపూర్ -శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ కింద కత్రా, బనిహాల్ మధ్య 111 కి.మీల మార్గంలో ఈ వంతెన కీలకమైన లింక్.
దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్ను అనుసంధానం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2002లో ఈ బ్రిడ్జి్ నిర్మాణ పనులు ప్రారంభమైనా.. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయాయి. మళ్లీ 2017 నవంబర్లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి. 2019 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు భావించినా..2018లో కాంట్రాక్టు సమస్యల కారణంగా జాప్యం జరిగింది. కరోనా వల్ల మరింత ఆలస్యమైంది.
ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315 మీటర్లు. 17 వ్యాసార్థాలల్లో దీనిని నిర్మించారు. ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వే సెక్షన్లో ఈ లైన్ను రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బ్రిడ్జి జమ్మూ కశ్మీర్లోని బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై అనుసంధానంగా ఉంటుంది. ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదు. దీని జీవిత కాలం 120 సంవత్సరాలు ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉపయోగించారు. బ్రిడ్జి నిర్మాణంలో 17 పిల్లర్లను నిర్మించారు. బ్రిడ్జి మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులు. ఈ వంతెన నిర్మాణానికి ఉపయోగించే స్టీల్ 10 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటుంది. దీనిని గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకునేలా రూపొందించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకుని దీని ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా దేశంలోనే అత్యధిక తీవ్రత కలిగిన వీజోన్ భూకంపాలను కూడా బ్రిడ్జ్ తట్టుకోలదు.