- వైజాగ్ నుంచి ముంబయికి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
- 20 కిలోల సరుకు స్వాధీనం
సికింద్రాబాద్, వెలుగు : రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న యువకుడిని సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన ట్రింబక్ ఉబాలే(29) ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో గంజాయి సప్లయ్ మొదలుపెట్టాడు. వైజాగ్లో తక్కువ రేటుకు గంజాయిని కొని రైలులో సికింద్రాబాద్ మీదుగా ముంబయికి తరలించి అక్కడ ఎక్కువ రేటుకు అమ్మేవాడు. ఈ నెల 10న వైజాగ్ లోని ఏజెన్సీ ఏరియాకు వెళ్లి అక్కడ 20 కిలోల గంజాయిని కొన్నాడు. వాటిని 10 ప్యాకెట్లుగా చేసి బ్యాగ్లో పెట్టుకున్నాడు. వైజాగ్ రైల్వే స్టేషన్లో ముంబయికి వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు.
మరుసటి రోజు మధ్యాహ్నం రైలు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంది. గంజాయి సప్లయ్ గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు పదో ప్లాట్ఫాంలో ఉన్న ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. కోచ్ నం.2లో ఉన్న ట్రింబక్ ఉబాలే బ్యాగ్ను తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. మొత్తం 10 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ట్రింబక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
శేరిగూడలో మరొకరు..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలో గంజాయి అమ్ముతున్న బిహార్కు చెందిన పంకజ్ కుమార్ను ఎల్ బీనగర్ ఎస్ వోటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.