శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అమోఘం

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అమోఘం

హనుమకొండ: ప్రజలు సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవించాలంటే శాంతిభద్రతల ప్రాధాన్యత ఎంతో ఉందని, శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసుల పాత్ర అమోఘమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నాడు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముగింపు సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... కరోనా కారణంగా గత రెండేళ్లుగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించలేక పోయారని, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చొరవ తీసుకొని ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని విషయమని ఆయన అన్నారు. ఇక నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్స్ నిర్వహించాలని ఆయన కోరారు.

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీవ్ర ఒత్తిడలో ఉండే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. పోలీస్ శాఖను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులు ఒకవైపు భర్తీ చేస్తూనే, మరొకవైపు అర్హులైన పోలీసు అధికారులకు, పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా పోలీసులు విధి నిర్వహణకు అవసరమైన వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పోలీసుల విధి నిర్వహణకు సులభతరం చేసిందన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధ్యక్షత వహించారు. పోలీస్ డిప్యూటీ కమిషనర్లు పుష్ప, వెంకటలక్ష్మి, పోలీసు అధికారులు, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

ఉమెన్స్ వరల్డ్ కప్‎లో‎ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్