ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత తగ్గింది. బుధవారం సెషన్లో దేశ కరెన్సీ 83 లెవెల్ను క్రాస్ చేసి ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ ఇండెక్స్ పెరగడం, దేశం నుంచి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వెళ్లిపోతుండడంతో బుధవారం సెషన్లో డాలర్ మారకంలో రూపాయి 83.045 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని రికార్డ్ చేసింది. 82.32 వద్ద బలంగా ఓపెన్ అయినప్పటికీ గ్లోబల్ అంశాల ఒత్తిళ్లతో 61 పైసలు నష్టపోయి 83.01 వద్ద రూపాయి క్లోజయ్యింది. మంగళవారం సెషన్లో 82.40 వద్ద సెటిలయ్యింది. మరోవైపు ఆరు మేజర్ కరెన్సీలతో డాలర్ కదలికలను పోల్చే డాలర్ ఇండెక్స్ బుధవారం సెషన్లో 0.31 శాతం లాభంతో 112.48 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 90.77 డాలర్ల వద్ద కదులుతోంది. గత కొన్ని సెషన్ల నుంచి క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నాయి.
మార్కెట్ లాభాల్లో..
బెంచ్ మార్క్ ఇండెక్స్లయిన సెన్సెక్స్, నిఫ్టీలు వరసగా నాలుగో సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీలలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ బుధవారం సెషన్లో 147 పాయింట్లు (0.25 శాతం) లాభపడి 59,107 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 439 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17,512 వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు సుమారు 3 శాతం లాభపడ్డాయి. ‘ యూకేలో ఇన్ఫ్లేషన్ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ దేశ మార్కెట్ల వరస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. రిజల్ట్స్ బాగుండడంతో యూఎస్ మార్కెట్లు పెరుగుతున్నాయి. దీంతో లోకల్ మార్కెట్లు కూడా పాజిటివ్గా కదులుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. సెషన్ ప్రారంభంలో పెరిగిన ఇండెక్స్లు ఆ తర్వాత నెమ్మదిగా కిందకి పడ్డాయని, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. చాలా సెక్టార్లు ఇదే ట్రెండ్లో కదిలి చివరికి ఫ్లాట్గా ముగిశాయని వివరించారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా ఫ్లాట్గానే క్లోజయ్యాయి. గ్లోబల్గా చూస్తే సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. టోక్యో మార్కెట్ లాభాల్లో క్లోజయ్యింది. యూరప్లోని మెజార్టీ మార్కెట్లు మిశ్రమంగా కదిలాయి.