
- ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అమలు చేస్తం: కేటీఆర్
- ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి
హైదరాబాద్, వెలుగు: ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో ఈ-–-ఓటింగ్ అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తమ చేతుల్లోనే ఉన్నందున దీని అమలు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మోడీ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్లేం చేస్తారో తనకు తెలియదన్నారు. సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీలో హైసియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ కంపెనీల ప్రతినిధుల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు సేవలు అందించడంలో తమ ప్రభుత్వం టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటోందని కేటీఆర్ చెప్పారు. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్, నేర పరిశోధనకు ఈ టెక్నాలజీని వాడుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్లో మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేశామన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20% హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారని చెప్పారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం
హైదరాబాద్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పాటు చేశామని, ఇన్నోవేషన్ ఈకో సిస్టం డెవలప్ చేశామని కేటీఆర్ అన్నారు. టీ హబ్తో స్టార్టప్లకు అండగా నిలుస్తున్నామన్నారు. మహిళల కోసం వీ హబ్ ఏర్పాటు చేశామన్నారు. ఇన్నోవేషన్ సెల్, శానిటేషన్ హబ్ ఏర్పాటు చేశామని, దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని పది లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ పనులు ఈ ఏడాది పూర్తవుతాయన్నారు. 2050 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు వసతులు కల్పిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.