ఆర్టికల్ 370 రద్దుపై.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన CJI

ఆర్టికల్ 370 రద్దుపై.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన CJI

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం (డిసెంబర్ 11న) కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పంది. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరని అభిప్రాయపడింది. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని, అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారని చెప్పింది. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ.. శాశ్వతం కాదంది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.. హక్కుల విషయంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు..మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే.. ఆర్టికల్ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తీర్పును చెప్పారు. 

ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని.. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. ఆర్టికల్ 370పై రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని తన తీర్పులో వ్యాఖ్యానించారు చీఫ్ జస్టిస్. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని.. ఆదేశాలను సవాల్ చేయలేమని.. దేశ భద్రత విషయంలో ఇది కీలకం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్. భారత రాజ్యాంగం అనేది ఫైనల్ అని.. జమ్మూకాశ్మీర్ లో భారత్ లో అంతర్భాగం అయినప్పుడు ప్రత్యేక చట్టాలపై సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీజేఐ. 

జమ్మూకశ్మీర్‌ నుంచి లడ్డాఖ్‌ విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా సోమవారం (డిసెంబర్ 11న) ఆ తీర్పును వెలువరించింది.