
2030 నాటికి భారతదేశ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ ఉత్పత్తి సామర్థ్యం పది రెట్లు పెరిగి 25 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని రోడియం గ్రూప్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిలో చైనా, యూరప్, అమెరికా తర్వాత ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని తెలిపింది.
న్యూఢిల్లీ: మనదేశం ఎలక్ట్రిక్ కార్లకు అడ్డాగా మారుతుందని వెల్లడయింది. 2030 నాటికి వీటి ఉత్పత్తి, డిమాండ్ విపరీతగా పెరుగుతుందని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న రోడియం గ్రూప్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది.
దీని ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతమున్న 0.2 మిలియన్ యూనిట్ల నుండి పది రెట్లు పెరిగి 25 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. దీంతో భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిలో చైనా, యూరప్, అమెరికా తర్వాత ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది. రాబోయే ఐదేళ్ళలో భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సామర్థ్యం దేశీయ డిమాండ్ను 11 లక్షల నుండి 21 లక్షల యూనిట్ల వరకు మించిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఎగుమతి మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలంటే, చైనాతో పోటీ పడటానికి ఖర్చులను తగ్గించుకోవాలి. మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2024లో లక్ష యూనిట్ల నుండి 2030 నాటికి 14 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతదేశంలో మొత్తం కార్ల అమ్మకాలు 60 లక్షల యూనిట్లు. ఫోర్- వీలర్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) విస్తరణ రేటు 7–-23 శాతం ఉంటుంది.
గత ఆర్థిక సంవత్సరంలో, భారతీయ ఈవీ తయారీదారులు టాటా మోటార్స్, ఎంజీ మోటార్, మహీంద్రా దేశీయ మార్కెట్లో దాదాపు 90 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయించాయి. భారతదేశం అంచనా ఉత్పత్తి సామర్థ్యం 25 లక్షల యూనిట్లు కాగా, చైనా (2.9 కోట్లు), యూరోపియన్ యూనియన్ (90 లక్షలు), అమెరికా (60 లక్షలు) కంటే ఇది తక్కువ.