ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అసంతృప్తితో నిరుద్యోగులు

ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అసంతృప్తితో నిరుద్యోగులు

ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో  నియామకాల విషయంలో మాత్రం తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఆరోజు తెలంగాణ యావత్తు ఉద్యమంలో బరిగీసి కొట్లాడారు.తెలంగాణ ఉద్యమ నాయకత్వం కూడా ఉద్యమ సమయంలో ఇదే విషయాన్ని ప్రధానంగా వల్లె వేసింది. వేల సంఖ్యలో ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రమొస్తే ఆంధ్రా ఉద్యోగులందర్ని ఇక్కడి నుంచి పంపించి వేస్తే,  ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేస్తే తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని అప్పటి ఉద్యమ నాయకత్వం తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను ఆశలకు గురిచేసింది.

ఉ మ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది.  కొత్తగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయినా ఉద్యోగాలు వచ్చి తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని భావించారు. తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడినుంచి వెళ్లిపోతే ఆ ఖాళీలను భర్తీచేస్తే చాలా ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ తీరా చూస్తే రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడి నుంచి ఆంధ్రాకు వెళ్లిపోయిన ఉద్యోగుల సంఖ్య చాలా స్వల్పం. అయినా సరే ఖాళీగా ఉన్న ప్రతీ ఉద్యోగాన్ని తొందరగా భర్తీ చేస్తారని తెలంగాణ సమాజం అనుకున్నది. కానీ అలా జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో అసలు మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటా కోసం రాష్ట్ర ప్రభుత్వం బిస్వాల్ కమిటీని నియమించింది.ఈ కమిటీ కాలయాపన కోసమే అని చాలామంది భావించారు. అయినా మొత్తానికి బిస్వాల్ కమిటీ తెలంగాణలో మొత్తం ఒక లక్ష తొంభై ఒక్కవేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది.ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకత్వం ఊరించిన సంఖ్యతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఈ ఖాళీలైనా తొందరగా భర్తీ చేస్తారని ఆశించాం. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కేవలం తొంభైఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని అందులో 11 వేలమంది కాంట్రాక్టుగా పనిచేస్తున్నారని మిగతా 80 వేలకు పైగా ఉద్యోగాల్ని త్వరలో భర్తీ చేస్తామని సీఎం స్వయంగా అసెంబ్లీ నిండు సభలో ప్రకటించారు. పీఆర్సీ నివేదిక ప్రకారం లక్షా తొంభైవేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని భావించిన అనేకమందికి కేవలం90 వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్న ప్రకటన ఆశ్చర్యం, అసంతృప్తి కలిగించింది. ప్రకటించిన తొంభైవేల ఉద్యోగాల భర్తీ కూడా వేగంగా జరగడం లేదు.

నెలల తరబడి ప్రిపేరవుతున్నారు

కానీ గత ఏడాది కాలంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ మొదలుకొని వరస నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ సమాజంలో ఆశలు చిగురించాయి. వరస నోటిఫికేషన్లు  వరుస పరీక్షలతో తెలంగాణా నిరుద్యోగయువత మొత్తం ప్రిపరేషన్ లో మునిగిపోయింది. దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఏదో ఒక పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు. అశోక్ నగర్ చిక్కడపల్లి దిల్​సుక్ నగర్ లాంటి కోచింగ్ సెంటర్ లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారు. చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చిన నిరుద్యోగులు తల్లిదండ్రులు తమ రక్తాన్ని స్వేదంగా మలిచి సంపాదించి పంపించే డబ్బుతో చదువుకునేవారు ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సాధించాలనే కసితో ప్రయివేట్ ఉద్యోగాల్ని సైతం వదిలేసి ప్రిపేర్ అవుతున్నారు. అప్పటికే చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా కూడా గ్రూప్ 1 లాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలన్న కోరికతో సెలవులు పెట్టి చదువుతున్నారు. సెలవు ఇవ్వనన్నా విధులకు గైర్హాజరు అయ్యి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు భరించి మరీ సన్నద్ధం అవుతున్న వారు కూడా అనేకమంది ఉన్నారు. 

నిరుద్యోగి గుండె పగిలింది

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పరీక్షలు జరిగాయి. గ్రూప్ 1 పరీక్షకు ఇరవై ఐదువేల యాభై మంది అర్హత కూడా సాధించారు. ఇలాంటి తరుణంలో మార్చ్ 11 న సాయంత్రం నిరుద్యోగులకు పిడుగులాంటి వార్త తెలిసింది. మార్చ్ 12న జరగాల్సిన టీపీబీఓ పరీక్ష రద్దు అని, దీనికి కారణం పేపర్ లీక్ అని. అది ఒక పరీక్షకో రెండు పరీక్షలకో పరిమితం అనుకున్నారు. కానీ రెండు రోజులు ముగిసేసరికి అది మొత్తం అన్ని పరీక్షలకు చుట్టుకుంది. జరిగిన పరీక్షలు జరగాల్సిన పరీక్షలు మొత్తం రద్దయ్యాయి. నిజాయితీగా కష్టపడి చదివి అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడాలనుకునే ప్రతినిరుద్యోగి గుండె పగిలింది. ఇపుడు అన్ని పరీక్షలు రీషెడ్యూల్. ఇక మళ్లీ చదవాలి. మళ్లీ రూమ్ రెంట్, హాస్టల్ ఫీజ్, కుటుంబానికి దూరం. అయినా సరే భరిద్దాం అనుకుంటే తరువాత జరిగే పరీక్షలు అయినా పారదర్శకంగా జరుపుతారనే భరోసా తెలంగాణ నిరుద్యోగ సమాజంకు లేదు.

పటిష్ట వ్యవస్థ అవసరం

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంటర్ మీడియట్ పరీక్షల గ్లోబరీనా మూల్యాంకనం లాంటి అకడమిక్ విషయాల నుంచి బతుక్కి సంబంధించిన ఉద్యోగాల నియామకాల వరకు ప్రతి విషయం వివాదాస్పదమవుతూనే ఉంది. ప్రతీ నోటిఫికేషన్ ఏదో రకంగా కోర్ట్ మెట్లు ఎక్కడం వాయిదాలు పడడం, తరువాత సవరించుకోవడం జరుగుతూనే ఉంది. దీనివల్ల ఎన్నో వ్యయ ప్రయాసలు పడి సన్నద్ధం అయ్యే అభ్యర్థులు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీని నివారణకు పటిష్ట వ్యవస్థ అవసరం. యూపీఎస్సీ లాంటి కమిషన్ ఏడాదికి ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది.దాని ప్రకారం నియామకం చేపడుతోంది. అలాంటి ఆదర్శ నియామక ప్రక్రియను అనుసరించాలి. అవసరమైతే కొత్త సంస్కరణలు తీసుకురావాలి. నిరుద్యోగ సమాజంలో నెలకొన్న అపోహాలు తొలగించాలి. అప్పుడే ప్రభుత్వం మీద,  కమిషన్ మీద అనుమానపు తెరలు తొలగిపోతాయి.
- అనంగళ్ల పరమేశ్​, (2022 గ్రూప్ 1 ప్రిలిమ్స్​లో అర్హత సాధించి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవకాశం కోల్పోయిన ఓ అభ్యర్థి)