వరంగల్ లో చేపల వేటకు వెళ్లి వాగులో పడి యువకుడు మృతి

వరంగల్ లో చేపల వేటకు వెళ్లి వాగులో పడి యువకుడు మృతి

వరంగల్ రూరల్ :  చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం నెక్కొండ మండలం నాగారం గ్రామంలో జరిగింది. కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన వాంకుడోత్ వినోద్(23) ఉదయం చేపలు పట్టేందుకు సమీపంలోని నెక్కొండ మండలం నాగారం గ్రామశివారులోని వట్టి వాగుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా వాగు ఉధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు రక్షించేందుకు యత్నించినా సాధ్యం కాలేదు.

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తుల సాయంతో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన ప్రాంతానికి కొద్దిదూరంలోనే వినోద్‌ మృతదేహాన్ని గుర్తించారు. వినోద్‌ మృతితో కుటుంబీకులు కన్నీంటిపర్యంతమయ్యారు. చేతికివచ్చిన కొడుకు మృత్యువాతపడ్డాడంటూ తల్లిదండ్రులు రోదించిన తీరుతో అక్కడి వారు చలించిపోయారు.