సైఫాబాద్, వెలుగు: జనగణన ప్రక్రియ వల్ల బీసీలకు ఎలాంటి లాభం చేకూరదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ కులాల వారీ గణన లేకుండా చేసే సర్వే నిరర్ధకమని ఆయన విమర్శించారు. సోమవారం సైఫాబాద్లోని బీసీ జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతేడాది కేంద్ర కేబినెట్ మీటింగ్లో సమగ్ర కుల గణన చేపడతామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత జనగణనలో బీసీల లెక్కలపై స్పష్టత లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నమూనాగా తీసుకుని కేంద్రం ముందుకు సాగాలని ఆయన సూచించారు. జనగణనలో బీసీ కాలమ్ చేర్చకుంటే, వచ్చే నెలలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనను అడ్డుకుంటామని, నల్లజెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

