ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే
నేను మాట్లాడతా
ఎన్పీఆర్ దేశానికి
అవసరం: రజినీకాంత్
సీఏఏ, ఎన్పీఆర్ల వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ల తరఫున పోరాడేందుకు నేను ముందుంటాను. ప్రతిపక్షాలు, కొందరు మతపెద్దలు తమ స్వార్థం కోసం సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్పీఆర్ను కచ్చితంగా అమలు చేయాలి. – రజినీకాంత్
చెన్నై: నేషనల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)తో దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని సినీయాక్టర్ రజినీకాంత్ అన్నారు. ఎన్పీఆర్ను కచ్చితంగా అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. “ సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ల తరఫున పోరాడేందుకు ముందుంటాను” అని రజినీకాంత్ చెప్పారు. ఇండియా, పాక్ విడిపోయిన తర్వాత ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్న ముస్లింలను బయటకు ఎలా పంపుతారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు, కొందరు మత పెద్దలు తమ స్వార్థం కోసం సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రజినీ ఆరోపించారు. ప్రొఫెసర్లు, సీనియర్లతో మాట్లాడి దాని గురించి వివరాలు తెలుసుకోవాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆందోళనలు చేస్తున్న స్టూడెంట్స్కు ఆయన సూచించారు. తమిళ రెఫ్యూజీలకు డ్యూయల్ సిటిజన్ఫిప్ ఇవ్వాలని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై రజినీకాంత్ పోయిన ఏడాది డిసెంబర్లోనూ స్పందించారు. హింస, అల్లర్లు ఏ సమస్యకు పరిష్కారం కాదని, దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు.