పరకాల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

పరకాల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • పరకాల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​ కార్యకర్తల  పోటాపోటీ నినాదాలు

పరకాల, వెలుగు :  హనుమకొండ జిల్లా పరకాలలోని నామినేషన్​ సెంటర్ వద్ద బీఆర్ఎస్​, కాంగ్రెస్​కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల గడువు ముగుస్తుండడం, ముహూర్తం బాగుందనే ఉద్దేశంతో గురువారం పరకాల నియోజకవర్గ స్థానానికి నామినేషన్​ వేసేందుకు రెండు పార్టీల అభ్యర్థులు రెడీ అయ్యారు. కాంగ్రెస్​ అభ్యర్థి రేవూరి ప్రకాశ్​రెడ్డి ఉదయం 11 గంటలకు నామినేషన్​ సెంటర్​కు చేరుకున్నారు. కార్యకర్తలంతా బయటే ఉండగా.. ఆయన మరికొందరు నేతలతో కలిసి నామినేషన్​ వేసేందుకు లోపలికి వెళ్లారు. 

కొద్దిసేపటికి బీఆర్ఎస్​అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కూడా తన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నామినేషన్​ వేసేందుకు కేంద్రానికి వచ్చారు. రెండు వర్గాల కార్యకర్తలు తమ పార్టీల పేరుతో పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్​ వాతావరణం కనిపించింది. అలర్టయిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పరకాల వైపు, కాంగ్రెస్ కార్యకర్తలను హనుమకొండ రోడ్డు వైపు ఉండాలని సూచించి, అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.