పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో ఎక్కువగా డెలివరీలు జరిగేవి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో తక్కువగా జరిగేవి. అయితే ఇప్పుడవి దాదాపు సమానంగా జరుగుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో ప్రభుత్వ హాస్పిటళ్లలో 1,017 డెలివరీలు అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1,013 డెలివరీలు అయ్యాయి. డెలివరీకి హాస్పిటళ్లకు వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుండడం, సేవలందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం, వైద్య శాఖలో సమన్వయ లోపం, కేసీఆర్ కిట్ సరిగా అందకపోవడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి.
వైద్యశాఖ, వైద్య విధాన పరిషత్ చెరో దారి..
జిల్లా వైద్య విధాన పరిషత్పరిధిలో పెద్దపల్లి, గోదావరిఖని, మంథనిలో ప్రధాన ఆస్పత్రులు ఉండగా, జిల్లా వైద్య శాఖ పరిధిలో 15 పీహెచ్సీలు ఉన్నాయి. కూనారం, బేగంపేట, అంతర్గాంలలో సబ్ పీహెచ్సీలు ఉన్నాయి. అర్బన్ పీహెచ్సీలు 6 ఉండగా అవి ఒక గోదావరిఖనిలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితోపాటు 24 గంటలు పనిచేసే పీహెచ్సీలు 5 ఉన్నాయి. వీటిలో వైద్య విధాన పరిషత్, వైద్య శాఖ ఆధ్వర్యంలో నడిచే హాస్పిటళ్ల మధ్య కో ఆర్డినేషన్ సరిగా లేదు. ఆశాలు, ఏఎన్ఎంలు గ్రామాల్లో తిరుగుతూ గర్భిణుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరిస్తున్నారు.
టెస్టుల కోసం హాస్పిటళ్లకు తీసుకెళ్తున్నారు. పీహెచ్సీలలో లేని టెస్టుల కోసం పెద్ద ఆస్పత్రులకు వెళ్తే అక్కడి సిబ్బంది వీరిని పట్టించుకోవడం లేదు. గర్భిణులు, ఆశావర్కర్లను గంటల తరబడి వెయిట్ చేయించడంతో వారు ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే జంకుతున్నారు. పైగా గర్భిణులను పరీక్షించడం తమ బాధ్యత కాదన్నట్లు ప్రధాన ఆస్పత్రుల్లో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు.
మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైతే..
ప్రధాన ఆస్పత్రుల్లో తాత్కాలికంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్లే సమస్యలు తలెత్తుతున్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి తెలుస్తోంది. అదే కరీంనగర్లో మాదిరిగా ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ జిల్లాలో ఈ బిల్డింగ్ నిర్మాణం నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. త్వరగా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆఫీసర్లు, లీడర్లు స్పందించి త్వరగా మాతా శిశు సంరక్షణ కేంద్రం పూర్తి చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.