
యాషెస్ తర్వాత టెస్టు క్రికెట్లో అత్యంత పాపులర్ అయిన సిరీస్ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్కు అసలైన మజా ఇస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా టూర్లో ఉన్న ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో బిత్తరపోయింది. ఆసీస్ బ్యాటర్లను స్పిన్ వలలో వేసిన టీమిండియా రెండు మ్యాచ్ల్లో గెలిచి 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండూ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయాయి. సెకండ్ టెస్ట్ ముగిసిన తొమ్మిది రోజుల గ్యాప్ తర్వాత ఇండోర్లో బుధవారం మొదలయ్యే మూడో టెస్టులో ఇరు జట్లూ పోటీ పడనున్నాయి. ఢిల్లీ మ్యాచ్ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఇరు దేశాల ప్లేయర్లు.. ఇండోర్ టెస్టు కోసం రెడీ అవుతున్నారు. రెండ్రోజుల నుంచి ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి రెండు మ్యాచ్ల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడంపై ఆసీస్ ఫోకస్ పెట్టగా.. సిరీస్ క్లీన్స్వీప్పై గురి పెట్టిన ఇండియా తమ అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో సోమవారం ఆటగాళ్లంతా గ్రౌండ్లో చెమటలు చిందించారు.
రాహుల్, గిల్ పక్క పక్కనే
తొలి రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించినప్పటికీ ఇండియాను ఓ సమస్య వెంటాడుతోంది. అదే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫెయిల్యూర్. ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లో అతను 20, 17, 1 స్కోర్లతో నిరాశ పరిచాడు. దాంతో, అతని స్థానంలో శుభ్ మన్ గిల్ను ఆడించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేఎల్ తీరుపై మాజీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ, టీమ్ మేనేజ్మెంట్ చివరి రెండు టెస్టులకూ అతడిని కొనసాగించింది. కానీ, వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సోమవారం రాహుల్, గిల్ పక్క పక్క నెట్స్లో ఒకేసారి ప్రాక్టీస్ చేశారు. ఈ ఇద్దరి కోసం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక సమయం కేటాయించాడు. నెట్స్లో తొలి 18 బాల్స్ను బ్లాక్ చేసిన రాహుల్ తర్వాత స్పిన్నర్ల బౌలింగ్లో గాల్లోకి షాట్లు కొట్టాడు. ఆ తర్వాత గిల్ ప్రాక్టీస్ చేసిన వికెట్పైకి వెళ్లి అశ్విన్ను ఎదుర్కొన్నాడు. చాలా బాల్స్ను స్ట్రెయిట్ బ్యాట్తో ఆడుతూ కనిపించాడు. అతను డిఫెన్స్పై దృష్టి పెట్టాడు. మరోవైపు అందరికంటే ముందే గ్రౌండ్లోకి వచ్చి వామప్స్, ఫీల్డింగ్ సెషన్లో పాల్గొన్న గిల్ తర్వాత నెట్స్లో షాట్లు కొడుతూ దూకుడుగా కనిపించాడు. ఆ తర్వాత గిల్, రాహుల్ ఇద్దరూ త్రో డౌన్స్ ఎదుర్కొన్నారు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఒకే టైమ్లో నెట్స్లోకి వచ్చారు. ఇద్దరూ స్పిన్నర్ల బౌలింగ్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్లో స్ట్రెయిట్ బౌండ్రీలు కొట్టగా.. రోహిత్ పుల్, స్వీప్, రివర్స్ స్వీప్ సహా అన్ని రకాల స్ట్రోక్స్ ఆడుతూ కనిపించాడు. ఆల్రౌండర్ అశ్విన్ సెంటర్ వికెట్పై స్వీప్ షాట్లు ట్రై చేయగా.. అక్షర్ పటేల్ త్రో డౌన్స్ ఎదుర్కొన్నాడు. అదే సమయంలో స్లిప్ ఫీల్డింగ్పైనా ఇండియా ఫోకస్ పెట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్లిప్స్లో క్యాచ్లు డ్రాప్ చేసిన నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సమక్షంలో ప్లేయర్లు స్లిప్ క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు.
ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్పై ఆసీస్ ఫోకస్
ఇండియా స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ బౌలింగ్లో స్వీప్ షాట్లకు ట్రై చేసి తొలి రెండు టెస్టుల్లో వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంది. ఆతిథ్య స్పిన్నర్లను కౌంటర్ చేసేందుకు స్వీప్ బదులు సంప్రదాయ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్పై ఫోకస్ పెట్టింది. నెట్ సెషన్లో స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండ్ కో ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్తో పాటు క్రీజు ముందుకొచ్చి ఆడుతూ కనిపించారు. తొలుత స్మిత్, ఖవాజా తమ స్పిన్నర్లు లైయన్, కునెమన్ను ఎదుర్కొన్నారు. తమ డిఫెన్స్లో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరినీ లైయన్ ఇబ్బంది పెట్టగా.. కునెమన్ బౌలింగ్లో మాత్రం ఆసీస్ బ్యాటర్లు షాట్లు కొట్టారు. ఆ తర్వాత లబుషేన్, ట్రావిస్ హెడ్, హ్యాండ్స్కోంబ్.. ఆఫ్ స్పిన్నర్ మర్ఫి, లెగ్ స్పిన్నర్ స్వెప్సన్ను ఎదుర్కొన్నారు. హ్యాండ్స్కోంబ్ ప్రతీసారి ముందుకొచ్చి ఆడగా.. హెడ్ షాట్లు కొడుతూ కనిపించాడు. మరోవైపు గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ పూర్తి స్థాయి నెట్ సెషన్లో పాల్గొన్నాడు.