![ఈసారి కామన్ పీపుల్ థీమ్తో రిపబ్లిక్ డే వేడుకలు](https://static.v6velugu.com/uploads/2023/01/Republic-Day_lGgZ3UsDmY.jpg)
- వీవీఐపీల సీట్లలో వారికి ఆతిథ్యం
- సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కూలీలకు ఆహ్వానం
న్యూఢిల్లీ : సామాన్యుల రిపబ్లిక్ డేను మనం ఢిల్లీ గడ్డపై చూడబోతున్నాం. ఈసారి దేశ రాజధానిలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఇంతకుముందు వాటి కంటే వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ లో మెయిన్ డయాస్ ఎదుట ఉండే తొలి వరుసలో కూర్చోబోయే స్పెషల్గెస్ట్స్ జాబితాలో రిక్షావాలాలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు, చిరువ్యాపారులు ఉన్నారు. ‘పార్టిసిపేషన్ ఆఫ్ ది కామన్ పీపుల్’ థీమ్ తో ఈ ఏడాది రిపబ్లిక్ డేను జరుపుకుంటున్న నేపథ్యంలో సామాన్యులకు ముందువరుసలో కూర్చునే అవకాశాన్ని కల్పించారు. పార్లమెంటు సెంట్రల్ విస్టా, కర్తవ్య పథ్నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు రిక్షావాలాలు, చిరువ్యాపారులు, కూరగాయలు అమ్ముకునేవారిని జనవరి 26న వీవీఐపీ కుర్చీల్లో మనం చూడబోతున్నాం. ఆయా విభాగాల నుంచి ఎంపిక చేసిన వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఈసారి రిపబ్లిక్ డే కార్యక్రమానికి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సీసీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈజిప్ట్ కు చెందిన 120 మంది సభ్యుల సైనిక బృందం కూడా పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. 19 దేశాలకు చెందిన 166 మంది క్యాడెట్లు, 32 మంది ఆర్మీ ఆఫీసర్లు పరేడ్ లో పాల్గొననున్నారు.
ఈసారి ఆహ్వానాలన్నీ.. డిజిటల్ రూపంలోనే
రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి రిపబ్లిక్ డే పరేడ్ ఇదే. పరేడ్ను చూసేందుకు వచ్చే వారి కోసం మొత్తం 42000 సీట్లు సిద్ధం చేశారు. వీటిలో 32,000 టికెట్లను ఆన్ లైన్ లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంచారు. ఈసారి అతిథులు, ప్రేక్షకులకు జారీ చేసే ఆహ్వాన లేఖలు, టికెట్లను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. ఇందుకోసం https://aamantran.mod.gov.in/login అనే ప్రత్యేక పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. రిపబ్లిక్ డే పరేడ్ టికెట్ల అమ్మకాలు, అడ్మిట్ కార్డులు, పార్కింగ్ లేబుల్స్ జారీ ఇవన్నీ దీని ద్వారానే జరుగుతాయి. ‘ఈ –టికెట్’ కలిగిన వారందరూ జనవరి 26న పార్లమెంటు సమీపంలోని ఉద్యోగ్ భవన్, సెంట్రల్ సెక్రటేరియట్ లకు ఫ్రీగా మెట్రో రైడ్స్ చేయొచ్చు.