అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. చెస్ట్ ఎక్స్రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్లో ఉండి కోలుకోవచ్చన్నారు. డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని తెలిపారు.
కరోనా పాజిటివ్గా తేలి, తేలికపాటి లక్షణాలు ఉన్న వారు రక్త పరీక్షలకు కూడా వెళ్లాల్సిన పనిలేదన్నారు. బయోమేకర్స్ హానికరమని, సీటీ స్కాన్ కూడా అత్యవసరమైతేనే చేయించాలని సూచించారు. కరోనా తొలి దశలో స్టెరాయిడ్స్ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల న్యూమోనియాకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా అది ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉందన్నారు. తేలికపాటి కేసుల్లో సాధారణ మందులతో కొవిడ్ నయమైపోతుందని తెలిపారు డాక్టర్ గులేరియా.