- నాలుగో తరగతి పిల్లాడిపై తోటి విద్యార్థుల దారుణం
- మధ్యప్రదేశ్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఘటన
ఇండోర్: నాలుగో తరగతి చదువుతున్న నలుగురు చిన్నారుల మధ్య లొల్లి పుట్టింది. వాళ్లమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ముగ్గురు కలిసి జామెట్రీ కంపాస్తో నాలుగో స్టూడెంట్పై దాడి చేశారు. ఏకంగా 108 సార్లు కంపాస్తో ఆ చిన్నారిని పొడిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో పోయిన శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఈ ఘటనపై స్పందించింది. నలుగురు పిల్లలు పదేండ్ల లోపువాళ్లేనని.. ఇంత చిన్నవయసులో దారుణంగా ప్రవర్తించడం ఏంటని కమిటీ చైర్పర్స్ వల్లవి పోర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్లో ఏం జరిగిందో, పిల్లలు ఇంత హింసాత్మకంగా ప్రవర్తించేందుకు కారణమేందో తేల్చాలని పోలీసులను కోరారు. వీడియో గేమ్లే ఇందుకు కారణమా అని అనుమానం వ్యక్తం చేశారు.
తన కొడుకుపై దాడికి కారణమేందని అడిగితే స్కూల్ మేనేజ్మెంట్ స్పందించలేదని, క్లాస్ రూం సీసీటీవీ ఫుటేజీ అడిగినా ఇవ్వలేదని బాధిత చిన్నారి తండ్రి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.