
న్యూఢిల్లీ: ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ నటించిన సినిమా ‘‘థగ్ లైఫ్’’ ను కర్నాటక రాష్ట్రంలో విడుదల చేయపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంపై కర్నాటక ప్రభుత్వం స్పందన తెలపాలని ఆదేశిస్తూ.. ఒక రోజు టైం ఇచ్చింది.
సినిమా చూడకుండా నిరోధించడానికి ప్రజల తలపై తుపాకులు పెట్టకూడదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన బెంచ్ పేర్కొంది. కమల్ హాసన్ ఏదైనా అసౌకర్యంగా మాట్లాడినట్లయితే దానిని సమర్ధించబోమని, కర్నాటక ప్రజలు ఈ అంశంపై చర్చించి అతను తప్పు అని చెప్పాలని బెంచ్ పేర్కొంది. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ డిమాండ్ చేస్తూ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీం విమర్శించింది.